Ilambarathi | మియాపూర్ : సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ట్రాఫిక్ సీపీ జోయల్ డేవిడ్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని ఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, రాడిసన్ జంక్షన్ల వద్ద చేపట్టనున్న కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఐఐటీ జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించబోయే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను ప్రాజెక్టు విభాగం అధికారులతో సమీక్షించారు. జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కూడళ్ల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను కమిషనర్కు వివరించారు.
ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ కూడళ్ల సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పెరుగుతున్న ట్రాఫిప్కు అనుగుణంగా కూడళ్లను అభివృద్ధి చేసి.. వాహనాలు సులువుగా ముందుకు సాగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగనిరీతిలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఐఐటీ జంక్షన్లో చేపట్టనున్న ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలకు ఆస్తుల సేకరణ, ట్రాఫిక్ ఇతర అంశాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐటీ పరిశ్రమలు అధికంగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లో రహదారుల విస్తరణ, కూడళ్ల సుందరీకరణ మరింత సౌకర్యాన్ని కలిగించేలా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.