మెహిదీపట్నం, డిసెంబర్ 8 : ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించి ప్రజలకు రాకపోకలు సజావుగా సాగేలా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కలిసి ఆపరేషన్ రోప్ను చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్ల పక్కన ఉండే ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఆక్రమణలను తొలగించే పనులను అధికారులు చేపడుతున్నారు. నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో ఫుట్పాత్ల ఆక్రమణల కారణంగా కలుగుతున్న ఇబ్బందులపై తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
దీని కోసం నాంపల్లి నియోజకవర్గంలోని మెహిదీపట్నం, ఆసిఫ్నగర్, మల్లేపల్లి డివిజన్లలో ఇప్పటికే రోప్ ఆపరేషన్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. ఆగాపురా, దారుసలాం, ఏక్మినార్ మసీదు ప్రాంతాల్లో రెండు రోజుల కిందట ఫుట్పాత్ ఆక్రమణలను గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ కోటేశ్వర్రావు నేతృత్వంలో నాంపల్లి ట్రాఫిక్, బేగంబజార్, హబీబ్నగర్ లాఅండ్ ఆర్డర్ పోలీసులు, జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు తొలగించారు.
కార్వాన్ నియోజకవర్గంలోని నానల్నగర్, టోలిచౌకి, లంగర్హౌస్ ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ రోప్లో భాగంగా ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. లంగర్హౌస్ డివిజన్లోని సంగం, బాపూఘాట్ ప్రాంతంలో తపోవనం పార్కు వద్ద ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ సర్కిల్-13 టౌన్ప్లానింగ్ ఏసీపీ సయీదుద్దీన్ నేతృత్వంలో టోలిచౌకి ట్రాఫిక్ ఎస్ఐ సమీఉజ్జమా, సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఏసీపీ సయీదుద్దీన్ మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలకు ఆపరేషన్ రోప్ ద్వారా రోడ్లపై రాకపోకలు సక్రమంగా జరుగుతాయన్నారు.
ప్రజలకు ఫుట్పాత్లు అందుబాటులో ఉండేలా ఆపరేషన్ రోప్ను కఠినంగా అమలు చేస్తాం. ట్రాఫిక్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించడానికి కృషి చేస్తున్నాం. జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి అన్నీ ప్రాంతాల్లో అమలు చేస్తాం.
– కోటేశ్వర్రావు, గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ