వనస్థలిపురం, ఆగస్టు 07: సాహెబ్నగర్లోని మ్యాన్హోల్లో దిగి మృతిచెందిన కార్మికుల కుటుంబాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించిన ఆమె.. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పక్షాలు చిల్లర రాజకీయాలు మానుకుని బాధితులకు అండగా ఉండాలన్నారు. ఆదివారం నుంచి కోయంబత్తూర్ టెక్నాలజీ ద్వారా అంతయ్య ఆచూకీ కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్ను ఇప్పటికే ఆదేశించామన్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మేయర్ వెంట కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, కాంట్రాక్టర్ నుంచి మరో రూ.5 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేశారు.