ఘట్కేసర్ రూరల్, మే 25: విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను ఘట్కేసర్, ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో మల్కాజిగిరి ఎస్వోటీ డీసీపీ ఆర్.గిరిధర్, ఏసీపీ నరేశ్ రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ద్వారకానగర్కు చెందిన ఫొటోగ్రాఫర్ తాల్క రాములు గతనెల 7న గుడ్ఫ్రైడే సందర్భంగా ఉదయం 11.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్లాడు. అదే అదునుగా భావించిన అనంతపూర్ జిల్లాకు చెందిన పీట్ల గంగాధర్ (26) మెయిన్ డోర్ తలుపు తాళాన్ని ఇనుప రాడ్తో పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అల్మారాలోని 21 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.5 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ఘట్కేసర్ పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాలను అంగీకరించాడు. నిందితుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాలలో 42 దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నిందితుడు తన కోరికలు తీర్చుకోవడానికి 2011 నుంచి దొంగతనాలను చేస్తున్నాడు.
పగటి పూట కాలినడకన బస్తీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని ఎంచుకుంటాడు. తన వద్ద ఉన్న ఇనుప రాడ్తో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతాడు. పగటి పూట మాత్రమే దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఈ నిందితుడి వద్ద నుంచి రూ.3,48,900 నగదు, 16.5 తులాల బంగారు ఆభరణాలతోపాటు దొంగతనానికి ఉపయోగించిన ఇనుప రాడ్, చేతి గ్లౌజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ జంగయ్య, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రాములు, ఎస్సై రఘురాం, ఎస్వోటీ, క్రైం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.