పీర్జాదిగూడ, ఏప్రిల్ 7: గోల్డ్ కాయిన్ స్కీమ్ పేరుతో పలువురిని మోసగించి వారి వద్ద కోట్లలో సేకరించిన డబ్బుతో ఉడాయించిన ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ఉప్పల్కు చెందిన శ్రీకాంత్ జిన్నా నిర్వాహకుడు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిర్మలాహైట్స్లో ఫ్లాట్లో జనజాగరణ సమితి పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థలో వి.ప్రసాద్, లక్ష్మణ్, నాగేశ్వర్రావులను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని గోల్డ్ కాయిన్ స్కీం పేరిట లక్ష రూపాయలు కడితే 2లక్షల 70వేలను గోల్డ్ కాయిన్స్ రూపంలో ఇస్తామని పలువురిని మాయమాటలతో ఆకర్షించారు. బాధితులకు మొదట యూనిట్కు రూ.10 వేల చొప్పున కట్టి జాయిన్ అయితే వెంటనే 22 క్యారెట్ల 1గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇచ్చి మిగితా రూ.5 వేలకు ప్రతి వారం రూ.500లో టీడీఎస్ ట్యాక్స్ 10శాతం తగ్గించి 450 చొప్పున మీ బ్యాంక్ ఖాతాలో వేస్తామని, 60 వారాలకు రూ. 27 వేలు ఇస్తామని నమ్మించారు. స్కీంలో చేరిన వారికి క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఖాతాలో జమ చేశారు. ఒక్కొక్కరూ వందల యూనిట్లు అంటే లక్షలు ఇచ్చారు. వారి నుంచి కోట్లల్లో కాజేసి కొన్ని వారాలు నుంచి ఖాతాల్లో డబ్బులు వేయలేదు. దీంతో కార్యాలయానికి వచ్చి అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు వ్యక్తి కనిపిచకుండా పోయాడు. ఈ స్కీంలో వందల మంది చేరారు. మోసపోయామని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్, అంబేద్కర్ కోనసీను జిల్లాకు చెందిన బాధితుడు సత్తి శ్రీనివాస సోమిరెడ్డి శుక్రవారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఉప్పల్ పల్లికాయల మిషన్ల నుంచి నూనె తీసి అమ్మితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసి బిచాణా ఎత్తేసినట్లు సమాచారం.