తడి పొడి చెత్తను వేరు చేయాలి
ప్లాస్టిక్ కవర్లు వద్దు.. జూట్ బ్యాగులే మేలు
‘స్వచ్ఛ సర్వేక్షణ్’పై ప్రజలకు అవగాహన
బడంగ్పేట, మార్చి 29: స్వచ్ఛ బడంగ్పేటగా తీర్చిదిద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా స్వచ్ఛ భారత్ పై అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛ బడంగ్పేట పై ఇప్పటి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు, అధికారులతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం దక్షణ భారత దేశంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 4వ ర్యాంక్ సాధించింది. ఈసారి మొదటి స్థానం సాధించే దిశగా మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వంకాయల యాదగిరి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ బడంగ్పేటగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల అవగాహన కోసం ర్యాలీలు తీస్తున్నారు. వాల్ పెయింటింగ్ వేయిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది. జవాన్లు ఇతర సిబ్బంది పనితీరుపై ఆరా తీస్తున్నారు. పనిచేస్తున్న సిబ్బందిని అవార్డులతో ప్రోత్సహిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో దేశంలోనే బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలబడే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పారిశుధ్యం లోపించకుండా చర్యలు..
పారిశుధ్యం లోపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛ బడంగ్పేటగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. వంద శాతం డోర్ టూ డోర్ చెత్త సేకరణ చేయిస్తున్నాం. బ్యూటిఫికేషన్ చేయిస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్లో బడంగ్పేటకు మొదటి స్థానం రావడానికి ప్రయత్నిస్తున్నాం.
– కృష్ణమోహన్రెడ్డి, కమిషనర్
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం..
: స్వచ్ఛ సర్వేక్షన్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతున్నాం. పనిచేస్తున్న సిబ్బందికి ప్రోత్సహిస్తున్నాం. తడి పొడి చెత్తను ఎలా వేరు చేయాలో ప్రజలకు వివరిస్తున్నాం. ఇంట్లో ఉన్న చెత్తతో ఎరువులు ఎలా తయారు చేయాలో శిక్షణ ఇస్తున్నాం.
– యాదగిరి, శానిటరీ ఇన్స్పెక్టర్