ఈ నగరానికి ఏమైంది.. ? ప్రతి నగరవాసి మదిలో తొలుస్తున్న ప్రశ్న ఇది. ఎక్కడికక్కడే పేరుకుపోతున్న వ్యర్థాలు.. దాడి చేస్తున్న దోమలు.. విజృంభిస్తున్న రోగాలు.. కుక్కల స్వైరవిహారం.. తడిపొడి చెత్త సేకరణలో వైఫల్యం..ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం.. అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. బల్దియాలో పాలన గాడితప్పుతున్నది. కోటి మందికి పైగా ఉన్న ప్రజలకు జీహెచ్ఎంసీ సేవలు సకాలంలో అందడం లేదు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి.. పరిస్థితులను చక్కదిద్దాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కేవలం టెలీకాన్ఫరెన్స్ల వరకే పరిమితమవుతుండటంతో స్వచ్ఛతలో భాగ్యనగరాన్ని అగ్రస్థానంలో నిలుపాలన్న లక్ష్యం నీరుగారుతోంది.
-సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ )
గ్రేటర్ వ్యాప్తంగా చెత్త డబ్బాలను ఎత్తి వేయగా, ఇప్పటికీ 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ఇటీవల నిర్వహించిన సర్వేలో తేల్చడం.. అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి . వ్యర్థాలతో నిండిపోయినా బస్తీలు, కాలనీలు వెరసి దోమలతో దవాఖానల్లో పెరుగుతున్న వ్యాధి పీడితులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
అడుగడుగునా కొందరి అధికారుల అవినీతి లెక్కలు, రికార్డుల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించని సిబ్బంది..కాగితాల్లో మాత్రమే కనిపించే చెత్త తరలింపు..మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ మొదలుకొని డిప్యూటీ కమిషనర్ల వరకు క్షేత్రస్థాయి పర్యటనలు ఉండటం లేదు. మేయర్, కమిషనర్ కేవలం టెలీకాన్ఫరెన్స్లకే పరిమితమవుతుండటంతో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒక్క వీఐపీలు ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో మాత్రమే పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా కనబడుతుందే తప్ప.. కాలనీలు, బస్తీల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారుతోంది. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే పారిశుధ్యంపై ఫిర్యాదులు అధికం కావడం, ఇటీవల హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వయంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని, తన డివిజన్లో చెత్త ఎత్తడం లేదని అధికారులపై మండిపడటమే ఇందుకు నిదర్శనం.
వాస్తవంగా వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. దీని చక్కదిద్దేందుకు , చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. వర్షాలొస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధి చెంది రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే మలేరియా, డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణకు మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.