జీడిమెట్ల, ఏప్రిల్ 1: స్వచ్ఛమైన నీటి కోసం వినియోగించే నీటిశుద్ధి(ప్యూరిఫయర్స్) యంత్ర పరికరాలను నకిలీ తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, కూకట్పల్లి, కేపీహెచ్బీ పోలీసులు పట్టుకున్నారు. శనివారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఓటీ అదనపు డీసీపీ శోభన్తో కలిసి డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కొన్ని రోజులుగా కూకట్పల్లి, కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో శారద ఎంటర్ ప్రైజెస్ మహంకాళినగర్, కూకట్పల్లి, బ్లూ ఆక్వా వాటర్ సొల్యూషన్ కేపీహెచ్బీ, లింపిడ్ ఎంటర్ ప్రైజెస్ కేపీహెచ్బీ దుకాణాల్లో ప్రముఖ సంస్థలకు చెందిన కౌంట్, ఆక్వాగార్డ్, హెచ్యూఎల్ సంస్థలకు చెందిన నీటి శుద్ధి యంత్రాల వాటర్ ఫిల్టర్ ప్యూరిఫయర్స్ను నకిలీవి తయారు చేసి విక్రయిస్తున్నారు. మరమ్మతులు, సర్వీసు చేస్తుండటంతో దుకాణాలకు వచ్చిన వినియోగదారులకు కంపెనీలకు చెందినవి అంటూ విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన వినియోగదారులు నీటి శుద్ధి సక్రమంగా జరగడం లేదని, ఇటీవల ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో ఆ సంస్థలకు చెందిన ప్రతినిధులు సదరు దుకాణాలకు వెళ్లి ఆరా తీశారు. అక్కడ నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి వద్ద నుంచి ఢిల్లీ నుంచి తెప్పించిన నకిలీ ఉత్పత్తులు, ట్రేడ్మార్క్ స్టిక్కర్స్, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులు రింకు, నవీ, శ్రావన్, నిశాద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రధాన నిందితుడు ప్రదీప్జైన్ పరారీలో ఉన్నాడు. ఈ విలేకరుల సమావేశంలో బాలానగర్ ఎస్వోటి ఇన్స్పెక్టర్ రాహుల్దేవ్, కూకట్పల్లి ఇన్స్పెక్టర్ నర్సింగరావు, కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ కిషన్ తదితరులు ఉన్నారు.