మైలార్దేవ్పల్లి , మార్చి 2 : గంజా మత్తులో మైనర్ బాలుడిపై దాడి చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. తీగలకుంటకు చెందిన సమీర్ (17) మదీనలోని ఓ షాపులో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి షాపు నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఒవైసీ హిల్స్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సైఫ్ , అబ్బు, సమీర్, హజార్, కైఫ్లు సమీర్ను పట్టుకొని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తన వద్ద లేవని చెప్పడంతో అతన్ని దానమ్మ జోపిడి గుట్టలపైకి తీసుకువెళ్లి బట్టలు విప్పి విచక్షణరహితంగా కొట్టారు. ఇద్దరిని చంపేశాం.. నువ్వు డబ్బులు ఇవ్వకుంటే నిన్నుకూడా చంపేస్తాం అంటూ బెదిరిస్తూ చిత్ర హింసలకు గురిచేశారు. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న బాలుడు ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సమీర్ తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తలరించారు. అయితే దాడి చేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ మధు తెలిపారు. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటానని సీఐ తెలిపారు.