సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ప్రభుత్వం శాఖల అధికారులతో సమన్వ యం చేసుకుని పనిచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 36 చెరువుల వద్ద నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లపై సీపీ సమీక్షించారు. భక్తులకు, విగ్రహాల తరలింపు నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, డయల్ 100 కాల్స్కు వెంటనే స్పందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, బాలానగర్ డీసీపీ పద్మజ, ఎస్ఓటీ అదనపు డీసీపీ సందీప్, మాదాపూర్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంత్రావు, అధ్యక్షుడు రాఘవరెడ్డి, వీహెచ్పీ అధ్యక్షుడు రామరాజు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.