సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు త్వరలో ప్రారంభం కానుండటంతో పోలీసులు మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, దీనివల్ల బందోబస్తు, నిమజ్జన ఏర్పాట్ల కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవడం సులువవుతుందని ఉత్సవ కమిటీలకు సూచిస్తున్నారు. https://www.hyderabadpolice.gov.in/ వెబ్సైట్ ద్వారా సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు పోలీసుల వద్ద ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహాలకు సంబంధించిన సమాచారం ఉండాలి. దీనివల్ల ఫలాన బస్తీ, కాలనీ, అపార్టుమెంట్లలో ఉన్న విగ్రహాల సంఖ్య ఆధారంగా స్థానికంగా బందోబస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. పర్యవేక్షణ కోసం క్యూ ఆర్ కోడ్లను కేటాయించేందుకు అవకాశముంటుంది. నిమజ్జనం రోజు ఏ రూట్లలో ఎన్ని విగ్రహాలు వస్తున్నాయనే వివరాలతో రూట్ మ్యాప్ను తయారు చేసుకుంటారు. ఆయా రూట్లలో జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, ఆర్ అండ్బీ శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవం సాఫీగా సాగేలా చూస్తారు.
పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి విజుబుల్ పోలీసీంగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రా పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గణేశ్ నవరాత్రుల బందోబస్తుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. డయల్ 100కు వచ్చే ఫోన్ కాల్స్పై వెంటనే స్పందించాలన్నారు. ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, బాలానగర్ డీసీపీ పద్మజ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్వోటీ డీసీపీ సందీప్, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.