ఖైరతాబాద్లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి ప్రతిష్టాపన పూజ ఉదయం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం 6గంటలకు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో 60 అడుగుల గాయత్రి (జంధ్యం), నూలు కండువా, గరికమాలతో రాజ్దూత్ చౌరస్తా మీదుగా గుర్రపుబగ్గీలో తెలంగాణ సంస్కృతి కళారూపాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి కైరంకొండ సంతోష్ నేత ప్రారంభిస్తారు. ఉదయం 7గంటలకు స్వామి వారికి జంజంను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి, నూలు కండువాను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, గరికమాలను గవర్నర్ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ సమర్పిస్తారు. 10.15గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్లు హాజరై తొలిపూజలో పాల్గొంటారని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్, కార్యనిర్వహక కార్యదర్శి సింగరి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్ తెలిపారు.
ఖైరతాబాద్, ఆగస్టు 30: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా బుధవారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు. ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని ప్రతిష్టించారు. అన్ని విగ్రహాలను పూర్తిగా మట్టితో రూపొందించడం విశేషం.
విభిన్న రకాల విగ్రహాలతో నగరానికి నవరాత్రి శోభ వచ్చింది. చిట్టి గణపయ్యల నుంచి భారీ విగ్రహాల వరకు విభిన్న రకాల ఆకృతులతో కాలనీలు కళకళలాడుతున్నాయి. మండపాలకు గణపయ్యలు వస్తుండటంతో భక్తులు స్వాగతం పలికారు. జై గణేశా..జైజై గణేశా అంటూ నినాదాలు చేశారు. బుధవారం వినాయక చవితి కావడంతో పండ్లు, పూలు, స్వీట్లు, పూజా సామగ్రి దుకాణాలు వినియోగదారులతో సందడిగా కనిపించాయి. సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్నగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వినాయక మండపాలు కలర్ఫుల్గా దర్శనమిస్తున్నాయి. లంబోదరులు విభిన్న రూపాల్లో కొలువుదీరాయి. పూజా అనంతరం పూర్తిస్థాయిలో వినాయకులు భక్తుల దర్శనానికి అందుబాటులో ఉండనున్నాయి.
– సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ)
పంచముఖ గణపతి ఐదు ముఖాలను (భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం) పంచభూతాలుగా చెబుతారు. గణపతి అవతారాలలో లక్ష్మీగణపతికి మరో ప్రత్యేకత ఉంది. ఆది, ధాన్య, ధైర్య, గజ, సంతాన, విజయ, విద్యా, ధనలక్ష్మి అమ్మవార్లు అష్టలక్షులుగా కొలుస్తున్నారు. పంచముఖ లక్ష్మీ గణపతి ఏడు తలల ఆది శేషుడు నీడలో కొలువుదీరి ఆరు చేతుల్లో కుడివైపు అభయం, త్రిశూలం, కమలం, ఎడమవైపు గణనాధుడి ఇష్టమైన లడ్డూ ప్రసాదం, పరుశు, పాశంతో పద్మాసనుడై దర్శనమిస్తారు.
మహాలక్ష్మి గణపతికి కుడివైపు ఉపమండపంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్టించారు. పంచముఖాలతో నెమలి వాహనుడై పది చేతులలో కుడి వైపు త్రిశూలం, బాణం, కత్తి, పాశం, అంకుశం, అభయం, ఎడమవైపు శంఖం, ధనస్సు, డాలు, జెండా, పాశం, అభయ హస్తం చూపుతూ కనిపిస్తారు.
ఎడమవైపు ఉపమండపంలో త్రిశక్తి మహా గాయత్రి దేవి పంచముఖాలతో పద్మాసనురాలై ఉన్నారు. కుడివైపు చక్రం, గద, కమండలం, పద్మం, అభయం, ఎడమవైపు శంఖం, పరశు, పాశం, జపమాల అభయ హస్తాలతో ఆశీర్వదిస్తారు. అమ్మవారి కాలి వద్ద వేదగ్రంథాలు, హంస, ఫలహారం ఉంచారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనిలక్ష్మీ గణపతి స్వామి వారికి భక్తుడు వెంకట సూర్యనారాయణ శర్మ, లక్ష్మీ కౌసల్య మంగళవారం రూ.8 లక్షల విలువ చేసే బంగారు అభయ హస్తం
సమర్పించారు. దేవాదాయ సహాయ కమిషనర్ కృష్ణ, దేవాలయం కార్యనిర్వహణ అధికారి పి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నవరాత్రి మహోత్సవంలో స్వామివారికి అభయహస్తం అందించడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ రేనొవేషన్ చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, సభ్యులు హరిత, ప్రధాన అర్చకుడు కాశీనాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.