ఆధునిక శైలి.. అబ్బురపడే నిర్మాణాలు
5.50 ఎకరాల్లో.. రూ.35 కోట్లతో
సర్వాంగ సుందరంగా పార్కులు, నిర్మాణాలు
ఆధునిక శైలిలో థీమ్లు
పనులు పరిశీలించిన అర్వింద్కుమార్
త్వరలో ప్రారంభోత్సవానికి సన్నా హాలు
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : టీ కారిడార్లో అద్భుత పర్యాటక ప్రదేశం రూపుదిద్దుకుంటున్నది. చారిత్రక గండిపేట జలాశయం తీరంలో పర్యాటకులను కనువిందు చేసేలా కొత్తందాలను జోడిస్తూ సర్వాంగ సుందరంగా 5.50ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక పార్కును నిర్మిస్తున్నారు. సుమారు రూ.35.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పార్కు పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్లతో పాటు పలువురు అధికారులు గండిపేట వద్ద జరుగుతున్న అధునాతన పార్కు పనులను పరిశీలించారు.
హుస్సేన్సాగర్ తరహాలో..
ఐటీ రంగం అభివృద్ధితో హైదరాబాద్ మహానగరం పడమర దిక్కున శరవేగంగా విస్తరిస్తున్నది. ఐటీ కారిడార్లోని ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల వంటి ప్రాంతాలకు సమీపంలోనే గండిపేట జలాశయం ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరహాలో గండిపేట కింది భాగంలో పదుల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటయ్యాయి. ఐటీ రంగంతో పాటు సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారికి గండిపేట చుట్టు పక్కల ప్రాంతాలు నివాస కేంద్రాలు మారాయి. దీంతో జంటనగరాల్లో హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నది. త్వరలోనే జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట తీర ప్రాంతమంతా అద్భుత పర్యాటక కేంద్రంగా నగర వాసులను అలరించనున్నది.
ఆకట్టుకునే నిర్మాణాలు..
చారిత్రాత్మక నేపథ్యం ఉన్న గండిపేటను దృష్టిలో పెట్టుకొని పార్కును అత్యాధునిక నిర్మాణ శైలితో చేపట్టారు. స్వాగత ద్వారాన్ని అత్యంత భారీ ఆకృతిలో నిర్మించారు. అదేవిధంగా సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్లు, ఎంట్రెన్స్ ప్లాజా, వాక్వేస్, ఆర్ట్ పెవిలియన్, ప్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పేసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులను రూ.35.60 కోట్ల వ్యయంతో చేపట్టారు. హెచ్ఎండీఏ ఇంజినీరింగ్, అర్బన్ ఫారెస్ట్రీ విభాగాల అధికారులు పార్కు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 90శాతం పనులు పూర్తికాగా.. మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.