సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం : శనివారం అక్టోబర్ 2న జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్హౌస్ సంగం సమీపంలో ఉన్న బాపూఘాట్ ముస్తాబు అయ్యింది. బాపూఘాట్లో గాంధీజీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గవర్నర్లు శనివారం నివాళులు అర్పించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైద్రాబాద్ కలెక్టర్ ఎల్.శర్మన్ అధికారుల బృందంతో కలిసి బాపూఘాట్లో పర్యటించారు.
రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పర్యాటక, జలమండలి, ఆర్ అండ్ బి, లా అండ్ అర్డర్, ట్రాఫిక్, ఫైరింజన్, హార్టికల్చర్ విభాగాల అధికారులతో కలిసి బాపూఘాట్లో పర్యటించిన కలెక్టర్ గాంధీ జయంతిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గాంధీ ధ్యాన మందిరం, సమాధి, విగ్రహం ప్రాంతాలలో పర్యటించిన ఆయన అధికారులతో చర్చించారు.
ఇదిలా ఉండగా జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ శివ మారుతి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ కోటేశ్వర్రావు నేతృత్వంలో టోలీచౌకీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్రెడ్డి సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఆర్డీవో వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ, ఫైర్ డిపార్టుమెంట్ ఆఫీసర్ అమరనాథ్ గౌడ్, గోల్కొండ తహసీల్దారు శైలజ, హార్టికల్చర్ శాఖ అధికారి రాధాకృష్ణ, ఆర్ అండ్ బీ శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జల మండలి శాఖ అధికారి సందీప్ కుమార్, శ్రీను నాయక్ సమాచార శాఖ అధికారులు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.