సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నాన్ కొవిడ్ సేవలకు గాంధీ దవాఖాన సిద్ధమవుతోంది. లాక్డౌన్కు ముందు సెకండ్ వేవ్ సమయంలో ప్రతిరోజు వందకు పైగా కరోనా కేసులు గాంధీకి వచ్చేవి. 1300లకు పైగా ఐపీ పాజిటివ్ కేసులతో గాంధీ కిటకిటలాడేది. ఆక్సీజన్ పడకలకు నిరీక్షణ తప్పేది కాదు. వెంటిలేటర్ పడకల సంగతి ఇక సరేసరి. కాని, లాక్డౌన్ తరువాత పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 600లకు పడిపోయింది. ప్రధానంగా బ్లాక్ ఫంగస్ కేసులే అధికంగా ఉంటున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం, గాంధీలో 650 వరకు ఐపీ రోగులు చికిత్స పొందుతుండగా అందులో, 310 వరకు బ్లాక్ ఫంగస్ కేసులే ఉంటున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇప్పటి వరకు 450 బ్లాక్ ఫంగస్ శస్త్ర చికిత్సలు జరపగా, మరో 250 కేసులు శస్త్ర చికిత్సలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో దవాఖానలోని దాదాపు నాలుగు అంతస్తుల్లో ఉన్న వార్డులను ఖాళీ చేసి, క్యుమిగేషన్ చేసినట్లు తెలిపారు. కరోనా వార్డులు ఖాళీ అవుతుండటంతో నాన్ కొవిడ్ సేవలకు సన్నద్ధమవుతున్నట్లు గాంధీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ వేవ్ తరువాత కొవిడ్, నాన్ కొవిడ్ సేవలను అంధించిన విధంగానే గాంధీలో తిరిగి నాన్ కొవిడ్ సేవలు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాన్ కొవిడ్ రోగులు, కొవిడ్ రోగులకు సంబంధం లేకుండా వేర్వేరు బ్లాకులుగా విభజించి సేవలు అందించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. అన్ని రకాల వైద్య సేవలను కొవిడ్, నాన్ కొవిడ్ రోగులకు వేర్వేరుగా అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గా లు తెలిపాయి.
కేసులు మరింత తగ్గితే జూలైలో ప్రారంభిస్తాం
ప్రస్తుతం కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. 500 నుంచి 600 మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ కేసుల సంఖ్య మరింత తగ్గాలి. జూలై మొదటి వారం నాటికి కేసుల సంఖ్య 200 దిగువకు చేరుకుంటే అప్పుడు, ప్రభుత్వం సూచనలతో గాంధీలో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభిస్తాం. ఇప్పటికే ఖాళీయైన వార్డులను క్యుమిగేషన్ చేయిస్తున్నాం. నాన్ కొవిడ్ సేవలకు సిద్ధమవుతున్నాం. కేసులు తగ్గడమే లేటు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నియమాలు పాటిస్తే కేసుల సంఖ్య మరింత తగ్గవచ్చు.డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన