సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గాంధీ దవాఖానలో పడకలు ఖాళీ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వెంటిలేటర్ పడకల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవ్వగా వారం రోజుల నుంచి పెద్ద సంఖ్యలో ఖాళీ అవుతున్నాయి. గురువారం నాటికి గాంధీలో మొత్తం 702 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నట్లు కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. 702 మందిలో 320 బ్లాక్ ఫంగస్ కేసులు ఉండగా 378 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు వివరించారు. మొత్తం 650 వెంటిలేటర్ పడకలలో వంద పడకలు మాత్రమే రోగులతో నిండి ఉన్నాయని, మిగిలిన 450 పడకలు ఖాళీ అయినట్లు తెలిపారు. కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో దవాఖానలోని పలు వార్డులను షట్డౌన్ చేస్తూ రోగులన్న వార్డులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. ఈ క్రమంలో 5వ అంతస్తులో ఉన్న కరోనా వార్డును పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 2,3,7వ అంతస్తుల్లో మాత్రమే కరోనా రోగులు ఉన్నట్లు తెలిపారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తే తిరిగి నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.