మూత్రపిండాల జబ్బు మనిషిని ఆరోగ్యగానే కాదు.. ఆర్థికంగానూ చితికిపోయేలా చేస్తుంది. మరి అలాంటి వ్యాధికి కరోనా తోడైతే.. వారి పరిస్థితి ఏంటి? అసలే లక్షలు ఖర్చు పెట్టి
చేయించుకోవాల్సిన డయాలసిస్ సేవలు చేసుకునేది ఎక్కడ ? ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతున్న ఎందరికో తెలంగాణ ప్రభుత్వం నేనున్నానన్న భరోసానిస్తున్నది. గాంధీ దవాఖానలో ఎప్పటి నుంచో డయాలసిస్ సేవలను అందిస్తుండగా.. కరోనా మహమ్మారి పంజా విసిరిన తరుణంలోనూ వాటిని ఆపేయలేదు. పైగా.. కొవిడ్తో బాధపడుతున్న ఎంతోమంది కిడ్నీ పేషెంట్లకు చికిత్సనందిస్తూ వారికి కొత్త జీవితాన్నిస్తోంది. ఇటీవల కరోనాతో గాంధీలో చేరిన ఓ 80 ఏండ్ల వయస్సు కలిగిన కిడ్నీ రోగి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు.
అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ దవాఖానకు వచ్చిన వారు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. బన్సీలాల్పేట్, మే 22 : కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు కరోనా బారిన పడితే వారికి చాలా జాగ్రతగా వైద్యం అందించాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం నిరంతరం కృషి చేస్తున్నది కొవిడ్ నోడల్ కేంద్రంగా సేవలందిస్తున్న గాంధీ దవాఖాన. ఆసుపత్రిలోని నెఫ్రాలజీ విభాగంలో కరోనా సోకిన కిడ్నీ రోగులకు ప్రతిరోజు కొవిడ్ చికిత్సతో పాటు డయాలసిస్ కూడా చేస్తున్నారు. సాధారణంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి రోగులు కరోనా బారిన పడితే, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రైవేట్ దవాఖానల్లో చేర్పించడం, అక్కడ అధిక బిల్లులను కట్టలేక, చివరికి గాంధీకి తీసుకు రావడం పరిపాటిగా మారింది.
కిడ్నీ రోగులకు డయాలసిస్ చేయడానికి తెలంగాణవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో 46 డీ-మెడ్ హెల్త్ కేర్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటన్నింటికీ గాధీ దవాఖాన నోడల్ కేంద్రంగా ఉంది. ప్రస్తుతం గాంధీలో 40 మంది కిడ్నీ సమస్యలున్న కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఖరీదైన రెమ్డెసివిర్ లాంటి మందులతో పాటు వెంటిలేటర్, ఆక్సిజన్, డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ అడ్మిట్ అయిన వారిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వారు, ఆస్తమా, టీబీ లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారు.
ఉస్మానియా, నిమ్స్తో పాటు జంటనగరాలు, ఇతర జిల్లా ప్రభుత్వ దవాఖానలు, పలు ప్రైవేట్ దవాఖానల నుంచి సీరియస్గా ఉన్న కొవిడ్ బాధితులను గాంధీ దవాఖానలో అడ్మిట్ చేసుకుంటున్నారు. కొవిడ్ పాజిటివ్తో చేరిన సాధారణ రోగులకు 7 నుంచి 9 రోజుల్లో నెగెటివ్ వస్తుండగా.. కిడ్నీఈ సమస్యలున్న వారికి 12 నుంచి 15 రోజుల తర్వాత కొవిడ్ నెగిటివ్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గాంధీ దవాఖానలో అలాంటి వారికి వెంటిలెటర్లు, ఆక్సిజన్, మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వేరే ప్రభుత్వ, ప్రైవేట్ లేదా డి-మెడ్ కేంద్రాల నుంచి వచ్చే ప్రతి రోగిని మా నెఫ్రాలజీ విభాగంలో అడ్మిట్ చేసుకుని, అవసరమైన వారికి డయాలసిస్ కూడా చేస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ఆధ్వర్యంలో గాంధీ దవాఖానలోని అన్ని విభాగాలు చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నాయి. కరోనా నోడల్ కేంద్రమైన గాంధీకి అత్యవసర పరిస్థితిలో వచ్చే ప్రతి రోగిని వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయా విభాగాలలో మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. డాక్టర్ ఎడ్ల మంజూష, గాంధీ దవాఖాన నెఫ్రాలజీ విభాగం హెచ్ఓడి