బన్సీలాల్పేట్: గాంధీ దవాఖానలో శస్త్రచికిత్స చేసేందుకు రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంపై సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన ఓ రోగి మోకాలు నొప్పితో గాంధీ దవాఖానను ఆశ్రయించాడు. పరీక్షలు జరిపిన వైద్యులు.. మోకాళ్ల మార్పిడి చేయాలని సూచించడంతో చికిత్స కోసం ఆర్థోపెడిక్ విభాగంలో అడ్మిటయ్యాడు. అయితే శస్త్ర చికిత్సలో జాప్యం కావడంతో, త్వరగా ఆపరేషన్ చేయడానికి పది వేల రూపాయలు ఇవ్వాలని ఓ వైద్యుడు డిమాండ్ చేశాడని, ఆ మేరకు రోగి భార్య దవాఖాన సిబ్బందికి పది వేల రూపాయలను గూగుల్పే ద్వారా పంపించినట్టు తెలిసింది. ఈ విషయమై బాధితురాలు పూర్తి వివరాలతో సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్గా తీసుకున్న సూపరింటెండెంట్.. వైద్యుడిపై వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను తెలుసుకునేందుకు నలుగురు హెచ్వోడీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ నిర్వహించిన అనంతరం కమిటీ ఇచ్చే నివేదికను డీఎంఈకీ సీల్డ్ కవర్లో పంపిస్తానని సూపరింటెండెంట్ డా.రాజారావు తెలిపారు.