హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తేతెలంగాణ) : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా నిర్వహించేందుకు బాట సింగారం లాజిస్టిక్ పార్క్, కొత్తపేట విక్టోరియా ప్లే గ్రౌండ్ స్థలాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలికంగా బాటసింగారానికి మార్కెట్ తరలింపు విషయంలో పునరాలోచన చేయాలని శాసనసభలో ప్రభుత్వానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేయగా, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, చర్చించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆదివారం మంత్రుల నివాస సముదాయంలో మంత్రి మహమూద్ అలీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు ఎంఐఎం ఎమ్మెల్యేలు సయ్యద్ జాఫర్ హుస్సేన్, అక్బర్ బిన్ అబ్దుల్లాలతో సమావేశమయ్యారు. బాటసింగారంలో అన్ని వసతులు కల్పించినట్లు మార్కెటింగ్ అధికారులు వివరించారు. కోహెడలో మౌలిక సదుపాయాలు కల్పించే వరకు బాటసింగారంలో కొనసాగిస్తామని ప్రతిపాదించారు. అయితే బాటసింగారానికి బదులుగా కొత్తపేట విక్టోరియా ప్లేగ్రౌండ్ (వీఎంహోం)లో కొనసాగించేందుకు పరిశీలించాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. దీంతో సోమవారం ఉదయం 8 గంటలకు మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, జాఫర్ హుస్సేన్, అక్బర్ బిన్ అబ్దుల్లాలు తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్వహణకు బాటసింగారం లాజిస్టిక్ పార్క్, విక్టోరియా ప్లే గ్రౌండ్ స్థలాలను పరిశీలించనున్నారు.