కొండాపూర్, ఏప్రిల్ 18 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) లో రెండు విద్యార్థి సంఘాల మధ్య చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రెండు విద్యార్థి సంఘాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో వర్సిటీని ఉద్రిక్తంగా మార్చింది. అర్ధరాత్రి విద్యార్థి సంఘాల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదంతో వర్సిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని జే హాస్టల్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వర్సిటీకి చెందిన రెండు విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. నినాదాల కారణంగా ఏర్పడిన వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారి ఘర్షణకు దారి తీసింది. తమపై అకారణంగా దాడి చేశారని ఓ సంఘానికి చెందిన బాలకృష్ణ, మరో విద్యార్థి సంఘానికి చెందిన హఫీజ్ ఫిర్యాదు చేశారు.
ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు.. రెండు వర్గాల వారిపై కేసులు నమోదు చేసి, వర్సిటీలో భద్రతను పెంచారు. రెండు సంఘాల విద్యార్థులు తమపై దాడి జరిగిందంటూ.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుని ఆందోళనకు పిలుపునివ్వడంతో వర్సిటీ ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ వివాదంతో వర్సిటీలోని మిగితా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యార్థులను చెదరగొట్టారు. వర్సిటీలో ఎలాంటి ఆందోళనలు చేపట్టరాదని, బయటి వ్యక్తులను లోనికి అనుమతి ఇవ్వడంలేదు. మాదాపూర్ డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.