మణికొండ, మార్చి 22 : జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా(జేకేఏఐ) అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్-2025కు హైదరాబాద్ మహానగరం అతిథ్యం ఇవ్వనున్నదని జేకేఏఐ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సెన్సాయి రాపోలు సుదర్శన్ తెలిపారు. నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్లోని డుజో కరాటే శిక్షణ క్యాంపస్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత భారతదేశంలోని హైదరాబాద్లో తొలిసారిగా అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పారు. ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా 3వేల మందికి పైగా కరాటే యోధులు పాల్గొంటారని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 22 వరకు నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ‘అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్-2025’ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టామన్నారు. 17వ ఆల్ ఇండియా జేకేఏఐ క్యూ లెవల్ కరాటే, 12వ ససాకి, షోయిచి, మెమోరియల్ సీనియర్స్ నేషనల్ కరాటే పోటీలు జరుగుతాయన్నారు. కటా(ఫారం), కుమిటే(స్పారింగ్) భాగస్వామ్యానికి ఎంపికలు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర జేకేఏఐ నూతన చీఫ్ ఇన్స్ట్రక్టర్గా సెన్సాయి దయానంద్ కుమార్ను నియమిస్తున్నట్లు రాపోలు సుదర్శన్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ పోటీలకు దయానంద్ ప్రధానకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి జేకేఏఐ డైరెక్టర్లు శ్రీనివాసచారి, ధన్రాజ్, విష్ణువర్ధన్, శ్రీకాంత్, చెన్నయ్య, చందర్, నాగరాజ్, శ్యాంసన్ పాల్గొన్నారు.