ఎల్కతుర్తి, సెప్టెంబర్ 6 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారకుడై, కోర్టుకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోయి తిరిగి వచ్చిన నిందితుడిని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఎల్కతుర్తి ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా హన్మాజిపేట మండలం మద్దుల్తండాకు చెందిన మెగావత్ దీప్సింగ్(39) ఆర్టీసీలో అద్దె బస్సు నడిపేవాడు. ఈ క్రమంలో ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట వద్ద 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమయ్యాడు. దీంతో అప్పుడు అతడిపై ఎల్కతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి హుజూరాబాద్ కోర్టులో హాజరుపర్చారు.
అయితే బెయిల్పై వెళ్లిన దీప్సింగ్ కొద్ది నెలల నుంచి కోర్టుకు హాజరుకాకపోవడంతో 2015లో హుజూరాబాద్ కోర్టు అతడిపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. తర్వాత అతడి గురించి పోలీసులు వాకబు చేయగా, సౌదీ దేశానికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో వరంగల్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు అతడిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా, మంగళవారం దీప్సింగ్ స్వదేశానికి వచ్చిన క్రమంలో ఇమ్మిగ్రేషన్, శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు అతడిపై ఉన్న లుక్ఔట్ నోటీసులు గుర్తించారు. వెంటనే ఎల్కతుర్తి ఎస్సై జక్కుల పరమేశ్కు సమాచారం ఇవ్వడంతో ఎయిర్పోర్టుకు చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హన్మకొండలోని 4వ అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి, రిమాండ్కు తరలించారు.