సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఉచితంగా సరఫరా అవుతున్న ట్యాంకర్లు దుర్వినియోగం జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ట్యాంకర్ల డ్రైవర్లు నీటిని తప్పుదారి పట్టిస్తూ అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జలమండలిలో రిజిస్ట్రర్ అయిన ప్రతి ట్యాంకర్కు జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా పరిశీలిస్తున్నా.. అక్రమార్కులు విలువైన మంచినీటిని ప్రైవేట్గా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
రోజుకు పదుల సంఖ్యలో ట్యాంకర్లు దుర్వినియోగమవుతున్నా జలమండలి క్షేత్రస్థాయి అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జలమండలి నుంచి ట్యాంకర్ల ద్వారా ఉచిత తాగునీటిని ఆసిఫ్నగర్, అస్మన్ఘర్, బల్షెట్టి కేట్, బండ్లగూడ, బజారాహిల్స్, బొగ్గుల కుంట, చిలకలగూడ, దోమలగూడ, ఎర్రగడ్డ, ఫతేనగర్, మారేడ్పల్లి, మొఘల్పుర, నారాయణగూడ, రెడ్హిల్స్, షేక్పేట, శ్రీనివాసనగర్, ఎస్ఆర్ నగర్, తార్నాక, వెంగళరావు నగర్, జియాగూడ, ఆటోనగర్, గచ్చిబౌలి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని బస్తీలు, ఇతర ప్రత్యేక అవసరాలకు జలమండలి ఉచిత తాగునీటిని సరఫరా చేస్తుంది.
ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా అధికారులు మానిటరింగ్ చేస్తారు. అయినా కొందరు ట్యాంకర్ల డ్రైవర్లు దొడ్డిదారిన మంచినీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ట్యాంకర్ లొకేషన్కు చేరుకున్నా నీటిని డెలివరీ చేయకుండా మరోచోటికి తీసుకెళ్లి ప్రైవేట్గా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు ట్యాంకర్ మొత్తాన్ని డెలివరీ చేయకుండా సగం నీటిని వెనక్కి తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని ఆయా ప్రాంతాల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.