Vaccination | సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): చిన్నారులకు పుట్టినప్పటి నుంచి 10ఏండ్ల వయస్సు వరకు ఇచ్చే రెగ్యులర్ టీకాలు వారి ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడతాయంటున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటు వ్యాధులు, ఇతర భయంకర వ్యాధులు రాకుండా ముందస్తు టీకాలు వేయడం తప్పనిసరి అంటున్నారు పిల్లల వైద్యులు. పుట్టినప్పటి నుంచి 10 ఏండ్ల వయస్సు వరకు దశలవారీగా వారికి టీకాలు ఇప్పించాలని సూచిస్తున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా టీకాలు వేస్తారని నిలోఫర్ ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్బాబు దాంపురి తెలిపారు.
పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇటీవల ప్రభుత్వం పెంటా వ్యాక్సిన్ను కూడా ప్రవేశ పెట్టినట్లు ఆయన వివరించారు. ఐదు వ్యాక్సిన్ల సమూహాన్ని పెంటా వ్యాక్సిన్ అంటారు. అందులో డిప్టీరియా(డి), టెటనస్(టి), పెర్టసిస్(పీఏ), హెపటైటిస్-బి, హిబ్ అనే ఐదు రకాల వ్యాక్సిన్లు ఉంటాయన్నారు. ఈ పెంటా వ్యాక్సిన్ వేయడం వల్ల డిప్టీరియా వంటి భయంకర వ్యాధులతో పాటు కామెర్లు రాకుండా, పిల్లలకు గాలి, దుమ్ము తదితరాలతో ఏర్పడే తట్టు (అమ్మతల్లి) వంటి ఇన్ఫెక్షన్ల బారీ నుంచి రక్షణ ఇస్తాయన్నారు. సకాలంలో ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తే పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటారని పేర్కొన్నారు.
కొంత మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు వ్యాక్సిన్లు వేయించడంలో అశ్రద్ధ చేయడం, నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని చెప్పారు. దీని వల్ల పిల్లలు వ్యాధులకు గురై తీవ్ర అనారోగ్యం పాలవుతున్నట్లు ఆయన తెలిపారు. సకాలంలో వ్యాక్సినేషన్ చేయిస్తే 90శాతం వ్యాధుల నుంచి పిల్లలను సంరక్షించుకోవచ్చని అన్నారు.
గ్రేటర్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి బుధవారం చిన్నారులకు వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. నిలోఫర్ వంటి ప్రసూతి, చిన్నపిల్లల దవాఖానల్లో ప్రతిరోజూ వ్యాక్సిన్లు, టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.