సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తున్నది. పేద కుటుంబాలలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణకు ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఎల్సీఎఫ్) సంస్థతో కలిసి ప్రతి ఏటా 600 మందికి ఉపాధి కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రయోగాత్మకంగా చందానగర్ సర్కిల్ హుడా కాలనీలోని మోడల్ మార్కెట్ బిల్డింగ్ను లైట్హౌస్కు జీహెచ్ఎంసీ అప్పగించారు. ఈ మేరకు ఈ నెల 10న ఈ శిక్షణ కేంద్రాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. సిల్ డెవలప్మెంట్, సిల్ అప్గ్రెడేషన్ పేరిట శిక్షణా తరగతులు సదరు సంస్థ నిర్వహించనుంది.
శేరిలింగంపల్లిలో పైలెట్ ప్రాజెక్టు
జీహెచ్ఎంసీ పరిధిలో 4,846 కాలనీలు, 1,466 మురికివాడలు ఉండగా..వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నది. పైలెట్ ప్రాజెక్టుగా శేరిలింగంపల్లి చందానగర్లో ప్రారంభించి, క్రమంగా హైదరాబాద్లో ఉన్న 1,466 మురికివాడల్లో కూడా ఈ కార్యక్రమం అమలుకు సన్నద్ధమయ్యారు. జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తున్న లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సంస్థ అనేక కంపెనీలతో చర్చలు జరిపింది. ఇప్పటికే 96 మందికి శిక్షణ ఇచ్చి 55 మందికి కోర్సు ట్రైనింగ్ ఇచ్చి 38 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్, బ్యూటీ అండ్ వెల్నెస్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీటితోపాటు జావా, డేటా ఎంట్రీ, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, బీపీవో వంటి ఐటీ ఆధారిత కోర్సుల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శిక్షణాకాలం 3 నుంచి 6 నెలలు
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కోర్సులు 3 నెలల నుంచి 6 నెలల కాలంలోనే పూర్తి చేయవచ్చు. సంస్థ నిర్దేశించిన స్థలంలో శిక్షణ ఇస్తారు. దానితో పాటు ఆన్లైన్ ట్రైనింగ్ అందజేస్తారు. శిక్షణ ముగించిన వారికి లైట్హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సర్టిఫికెట్లు అందజేస్తుంది. కోర్సు పూర్తయిన వెంటనే వారి సామర్ధ్యాన్ని బట్టి వివిధ కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారికే శిక్షణ ఇస్తారు. విద్యార్హతలు, టాలెంట్ బట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ , జీహెచ్ఎంసీ అందిస్తున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.
అన్ని కోర్సుల్లో ఉచితంగా శిక్షణ
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతకు జీవనోపాధి కల్పించడమే లైట్హౌస్ లక్ష్యం. లైట్హౌస్లో చేరడం వల్ల వ్యక్తిత్వ వికాసం, డిజిటల్ అక్షరాస్యత, స్పోకెన్ ఇంగ్లిష్, కెరీర్ కౌన్సెలింగ్, కౌన్సిలింగ్ ఆధారంగా వృత్తి నైపుణ్యం కోర్సు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అన్ని కోర్సులు ఉచితం. వివరాలకు 8688100660 నంబర్లో సంప్రదించవచ్చు.
– కో ఆర్డినేటర్ ప్రశాంత్రెడ్డి