బడంగ్పేట, నవంబర్ 8: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. బడంగ్పేటలోని జిల్లా గ్రంథాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయించి గణేశ్ బిగ్ టైమ్ అకాడమి నిర్వాహకులు శివ శంకర్ ఆయన సతీమణి అనితలను బోధించేందుకు నియమించారు. గత మూడు నెలలుగా జిల్లా గ్రంథాలయంలో 400 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎస్ఐ, కానిస్టేబుల్, ఫైర్ డిపార్టుమెంట్, డిప్యూటీ జైలర్స్, కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించారు. ఇందులో శిక్షణ పొందిన 200మంది రాత పరీక్షలు రాయగా 194 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు నిర్వాహకులు శివ శంకర్ తెలిపారు. ఇంకా గ్రూప్స్కు శిక్షణ పొందుతున్న వారు పరీక్షలు రాయాల్సి ఉందన్నారు.
సీఆర్ఫీఎఫ్ రిటైడ్ ఉద్యోగిచే శిక్షణ
గణేశ్ బిగ్ టైమ్ అకాడమి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు పది మంది ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ సైతం అందజేస్తున్నారు. ఫిట్నెస్ కోసం ఉదయం 5 నుంచి 8గంటల వరకు రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ ఫుట్ తదితర వాటిలో సీఆర్ఫీఎఫ్ రిటైడ్ ఉద్యోగి ఎనుముల కొండల్ రెడ్డి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిలో మీర్పేట, బడంగ్పేట, బాలాపూర్, మల్లాపూర్, గుర్రంగూడ, నాదర్గుల్, మల్లాపూర్కు చెందిన వారే ఉన్నారు.
తప్పకుండా ఉద్యోగం పొందుతా..!
రెండు నెలలుగా ఇక్కడ ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నా. బాగా చెబుతున్నారు. తప్పకుండా ఉద్యోగం సంపాదిస్తాననే నమ్మకం ఉన్నది. ఇక్కడ పేద, మధ్య తరగతి వారే అధికంగా శిక్షణ పొందుతున్నారు. ఈ ఉచిత శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉంటే బాగుంటుంది.
– ఉదయ్, విద్యార్థి
శిక్షణ పొందిన వారికి ఉద్యోగం రావాలి
నాకు వచ్చిన విద్య పది మందికి ఉపయోగపడాలి. సీఆర్ఫీఎఫ్లో 18 సంవత్సరాలు పనిచేశాను. అపారమైన అనుభవం ఉంది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ వెంట్లో శిక్షణ ఇస్తున్నాను. శిక్షణ ఇచ్చిన వారికి ఉద్యోగం వస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.
– ఎనుముల కొండల్ రెడ్డి, కోచ్, సీఆర్పీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి
పేద, మధ్య తరగతి వారికోసమే..
పేద, మధ్య తరగతి వారు డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోలేరన్న ఉద్దేశంతో గత మూడు నెలలుగా అనుభవం ఉన్న అధ్యాపకులతో ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాం. 400 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చాం. ఎస్ఐ, కానిస్టేబుల్ రాత పరీక్షల్లో 194 మంది ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మంత్రి సబితాఇంద్రారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కమిషనర్, అధికారులు, గ్రంథాలయ చైర్మన్ పూర్తి సహకారం అందిస్తున్నారు. గ్రూప్ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది.
– శివశంకర్, డీఆర్డీఏ ఉద్యోగి