సిటీబ్యూరో, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ) : పుస్తక ప్రియుల కోసం మరో పండుగ వచ్చేసింది. ఎర్రమంజిల్ మెట్రోస్టేషన్ పక్కన నెక్ట్స్ ప్రీమియా మాల్లో ఆదివారం బుక్ ఫెయిర్ కొలువుదీరింది. ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. కితాబ్ లవర్స్ ఆధ్వర్యంలో ‘లోడ్ ద బాక్స్’ థీమ్తో 9 రోజుల పాటు నగరంలో పుస్తక పరిమళాలు వీయనున్నాయి. అన్ని రకాల విభాగాల నుంచి సుమారు 10 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ సందర్భంగా కితాబ్ లవర్స్ ఫౌండర్ రాహుల్ పాండే మాట్లాడుతూ.. హైదరాబాద్లో పుస్తక ప్రియులు అత్యధికంగా ఉంటారని.. ఇక్కడ బుక్ ఫెయిర్ నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఐదేండ్లుగా కితాబ్ లవర్స్ పేరుతో బుక్ ఫెయిర్ నిర్వహించామని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తక పఠనం చాలా తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో తల్లిదండ్రులు బుక్ ఫెయిర్ను సందర్శించాలని కోరారు. ఈ బుక్ ఫెయిర్లో ఉచితంగా రీడింగ్ కార్నర్ కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు.