హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 : మొన్నటిదాకా చైనా గేమ్ పబ్జీ పిల్లలు, యువతను పాడుచేసింది. టైం అంతా తినేసి వాళ్లను బానిసలుగా మార్చుకొన్నది. దాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయటంతో ఇప్పుడు ఫ్రీ ఫైర్ రూపంలో మరో డేంజర్ గేమ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన వీడియో గేమింగ్ సంస్థ సింగపూర్లో ఓ సంస్థను ఏర్పాటు చేసుకొని ఫ్రీ ఫైర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ గేమ్లో అత్యధికంగా బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్కు అధికంగా పిల్లలు, యువత ఆకర్షితులవుతున్నారు. అందులో భాగంగా తుపాకులు, ఇతర ఆయుధాలు కొనవచ్చు. అందుకు డబ్బులు చెల్లించాలి. ఫ్రీ ఫైర్కు బానిసైనవాళ్లు గేమ్ల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆటో పేమెంట్ మోడ్ యాక్టివేట్ అయితే, కొనే ప్రతీ ఆయుధానికి డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. గేమ్ ఎలాగైనా గెలవాలని పిల్లలు పేమెంట్ను ఓకే చేసేస్తున్నారు. దాంతో తల్లిదండ్రుల ఖాతాల్లోంచి డబ్బులు మాయమవుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి ఖాతా నుంచి వీడియో గేమ్ ఆడిన ఆయన మనుమడు ఏకంగా రూ.11 లక్షలు పెట్టి తుపాకులు కొన్నాడు. మనుమడు వీడియో గేమ్ ఆడుతానంటే స్మార్ట్ఫోన్ ఇచ్చారు. ఆ పిల్లాడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడాడు. ఆట మధ్యలో తుపాకి రూ.300కే కొనొచ్చు అని వచ్చింది. దాన్ని కొంటానని తాతకు చెప్పి ఓటీపీ అడిగాడు. ఓటీపీ ఎంటర్ చేయగానే, తదుపరి చెల్లింపులకు ఆటోపేమెంట్ యాక్టివేట్ అయ్యింది. అలా తాత ఖాతా ఖాళీ అయ్యింది. పోలీసులను ఆశ్రయించగా.. తీగ లాగితే ఇంత పెద్ద బాగోతం బయటపడింది. అందుకే పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, వీడియో గేమ్స్ ఆడుతుంటే మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
ఉత్తి పుణ్యానికి 5 వేల కోట్లు
రిటైర్డ్ పోలీస్ అధికారి ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. వీడియో గేమ్ల ద్వారా మన దేశం నుంచి ఏటా ఈ సంస్థలు రూ.5 వేల కోట్లు కొల్లగొడుతున్నట్టు సమాచారం. ఈ వీడియో సంస్థల వల్ల మన దేశానికి, రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదు. వీరు ఏ ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించరు. పెట్టుబడి లేకుండానే వేల కోట్లు దోచేస్తున్నారు.