కంటోన్మెంట్, మే 2 : కంటోన్మెంట్ ప్రాంతంలో ఉచిత మంచినీటి పథకం అమలుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి కొనసాగింపుగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బోర్డు మాజీ సభ్యులతో కలిసి మర్రి రాజశేఖర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల కిందట కంటోన్మెంట్లో మూసివున్న ఆరు రోడ్లలో ఐదు రోడ్లను లోకల్ మిలటరీ అధికారులు తెరిచారని, అదేవిధంగా ఆయా వార్డుల పరిధిలోని అంతర్గత రోడ్లను సైతం తెరిపించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. రోడ్లను తెరిపించేందుకు బీఆర్ఎస్ పార్టీతో పాటు స్థానిక కాలనీల వాసులు, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల సహకారం ఉన్నదని తెలిపారు.
ఇప్పటికే ఉచిత మంచినీటి పథకం అమలు
గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం జలమండలికి కంటోన్మెంట్ బోర్డు బకాయిలు ఇవ్వాల్సి ఉందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉచిత మంచినీటి పథకం కంటోన్మెంట్లో అమలవుతున్న నేపథ్యంలో ఇటీవల బోర్డుకు జలమండలి బిల్లులను పంపించిందని చెప్పారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్తో చర్చించగా త్వరలోనే బకాయిలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ కేంద్రం మాత్రం సర్వీస్ చార్జీల కింద బోర్డుకు రావాల్సిన సుమారు రూ.800కోట్లు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ఎన్ఎన్డీపీ ద్వారా రామన్నకుంట చెరువు, హస్మత్పేట, తిరుమలగిరి చెరువు అధునీకరణతో పాటు నాలాల అభివృద్ధి చేపట్టి కంటోన్మెంట్లో ముంపు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఐదవ వార్డులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యనందితా, నివేదిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నళినికిరణ్, లోక్నాథం, పాండుయాదవ్, ప్రభాకర్, భాగ్యశ్రీ, నేతలు ముప్పిడి మధుకర్, పెద్దాల నర్సింహ, కిరణ్, శర్విన్, సదానంద్గౌడ్, తేజ్పాల్, భాస్కర్, శేఖర్ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.