సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): సామాజిక సేవలో భాగంగా ట్రాన్స్ జెండర్స్ కోసం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. ‘సహాయత’ పేరుతో ఈ సేవలు పంజాగుట్టలోని ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ప్రతి రోజు ఉదయం 10:30 నుంచి మ.1:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ట్రాన్స్జెండర్స్ కోసం మూడునెలల బెడ్ అటెండెంట్ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ట్రాన్స్ జెండర్స్కు శిక్షణ అందించి ఉపాధి చూపనున్నారు. ఈ సేవలను ఇన్నర్ వీల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సుర్జీత్ కౌర్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ జయంతి కన్నన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సీమ కుమార్లు ప్రారంభించారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు చేయూతనివ్వాలనే సంకల్పంతో సహాయత సేవలు ప్రారంభించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ట్రాన్స్ జెండర్స్ వినియోగించుకోవాలని చెప్పారు. అంతేకాదు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్స్కు కౌన్సెలింగ్ కూడా అందిస్తామని వివరించారు. “సమాజంలో మమ్మల్నీ మనుషులుగా గుర్తించడానికే ఇష్టపడని ఈరోజుల్లో మా గురించి ఆలోచించి..మా ఆరోగ్యం, ఉపాధి అందిస్తున్న సంస్థకు మేము రుణపడి ఉంటాం” అని తెలంగాణ ట్రాన్స్ జెండర్స్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ రచన చెప్పారు.