సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) :ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని బాచుపల్లి లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసే అంశంపై ప్రజలను పకదారి పట్టిస్తున్న ఓ సంస్థ ఫౌండర్, సీఈఓగా ఉన్న రాధాకృష్ణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ ఫిర్యాదుపై బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ మలాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లిలో హెచ్ఎండీఏ 73 ప్లాట్లతో లేఅవుట్ను రూపొందించింది. దీనిపై ఫిబ్రవరి 17వ తేదీన బాచుపల్లి లేఅవుట్లో హెచ్ఎండీఏ అధికారులు ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు.
ఈ ప్రీ బిడ్ సమావేశానికి దాదాపు 300 మందికి పైగా ఔత్సాహిక కొనుగోలుదారులు హాజరయ్యారు. బాచుపల్లి లేఅవుట్లోని 73 ప్లాట్లను మార్చి 2, 3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆన్లైన్ ద్వారా వేలం (ఈ – ఆక్షన్) నిర్వహించాలని హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, మియాపూర్ క్రాస్ రోడ్డుకు, ఐటీ హబ్కు సమీపంలో ఉన్న హెచ్ఎండీఏ బాచుపల్లి లేఅవుట్ పలు గెటెడ్ కమ్యూనిటీ విల్లా వెంచర్ల మధ్యలో ఉండడం వల్ల ఎంతోమంది ఇకడి ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న బాచుపల్లి లేఅవుట్కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యక్తులు, సంస్థలు, హెచ్ఎండీఏ పేరుతో సాధారణ ప్రజానికాన్ని, ప్లాట్ల కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బాచుపల్లి లేఅవుట్లోని ప్లాట్ల కొనుగోలుకు పెట్టుబడుల స్వీకరణ పేరిట ఒక ఆంగ్ల దినపత్రికలో గత శనివారం(25వ తేదీ), ఆదివారం(26వ తేదీ) ప్రకటనలు ఇచ్చి ప్రజలను, ప్లాట్ల కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాన్ని హెచ్ఎండీఏ అధికారులు సీరియస్గా తీసుకున్నారు.
హెచ్ఎండీఏ పేరును ప్రస్తావిస్తూ ప్రజానీకాన్ని, కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి వారి మోసాలకు, ప్రభావాలకు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్ఎండీఏ ప్లాట్ల కొనుగోలుదారులకు విజ్ఞప్తి చేసింది. మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్ఎండీఏ అధికారులు సూచించారు.