రవీంద్రభారతి, ఆగస్టు 25 : ‘డిక్కీ సంస్థ’ పేరుతో దళితులనే లక్ష్యంగా చేసుకొని ఉపాధి కల్పిస్తామని, ఎస్బీఐ బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని సుమారు 60 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసి మోసం చేసిన పుట్టపాగ శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ.. 2019లో ఎస్బీఐ బ్యాంక్, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకుల నుంచి సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తానని, సమాజంలో గౌరవంగా బతికేలా చేస్తానని మాకు మోసపూరితమైన మాటలు చెప్పి మాకు తెలియకుండా మా పేర్లపైన బ్యాంకుల నుంచి ఒక్కొక్కరిపై రూ.10లక్షల వరకు లోన్లు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు.
బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి మీరు లోన్లు తీసుకున్నారని చెప్పే వరకు మాకు తెలియదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బులు కట్టకపోతే నోటీసులు ఇచ్చి బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని వారు వాపోయారు. ఈ మోసాలపై సీఎం కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీరాం సత్యనారాయణ, కందుల రాములు, చంద్రశేఖర్, నవీన్, చేతన్, ఎర్ర వెంకటేశ్, తల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.