బంజారాహిల్స్, మార్చి 15 : వీసా ప్రాసెసింగ్ కోసం చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని స్రవంతి నగర్లో నివాసముంటున్న మారియా జోసఫిన్ కెనడా వెళ్లేందుకు కావాల్సిన వీసా ప్రాసెసింగ్ కోసం గత ఏడాది ఆగస్టులో జూబ్లీహిల్స్లోని ఓపులెంటాస్ వీసా కంపెనీని సంప్రదించారు. వీసా ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ.1,18,000 చెల్లించాలని కోరగా ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 8న చెల్లించారు. అయితే ఆమె కుటుంబ సభ్యులకు మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడటంతో వీసా ప్రక్రియను నిలిపివేయాలని సంస్థ ప్రతినిధులు పూజా శుక్లాకు మూడురోజుల్లోనే సమాచారం ఇచ్చారు.
వీసా ప్రాసెసింగ్ ఆపేందుకు సరైన కారణాలు చూపించాలని కోరగా మెడికల్ రికార్డులతో పాటు అన్ని ఆధారాలు పంపించారు. అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదని, డబ్బుల కోసం ఒత్తిడి తీసుకువస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించడం ప్రారంభించారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు చెల్లించకపోవడంతో తమను ఉద్దేశపూర్వకంగానే మోసం చేశారని, ఓపులెంటాస్ వీసా సంస్థకు చెందిన పూజా శుక్లా, సీమా, పౌల్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త జాన్ పర్లా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై ఐపీసీ 420, 406, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.