ఒక్కో నేరగాడిది ఒక్కో ైస్టెల్.. అందరీకి రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించాలనే ఆశ… దీని కోసం ఎదుటి వారిని మోసం చేస్తున్నామనే ఫీలింగ్ను పక్కన పెడుతున్నారు.. మన సంతోషం మనకు దక్కితే చాలనుకుంటున్నారు.. లక్షలకు లక్షలు కాజేసి జల్సా చేస్తుంటారు.. ప్రమాదమని తెలిసినా డబ్బే ముఖ్యమంటూ ప్రమాదంలో పడుతూ.. ఇతరులను కూడా అందులోకి నెట్టేస్తున్నారు. దొరికితే జైలు ఖాయమని తెలిసి కూడా విలాసవంతమైన సుఖాల కోసం మోసాన్నే ఎంచుకుంటున్నారు.. పోలీసులకు పట్టుబడుతున్నా.. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మెసాలు, నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు.. ఇటీవల రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన దొంగల నేరప్రక్రియ ఇది… పట్టుబడిన దొంగలు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేశారు.. అయితే జల్సాలకు బానిసై.. హోదాలను మరిచి డబ్బు కోసం చీటింగ్లకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉంటున్న నాగరాజు ఓ ప్రైవేట్ బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్. అతడికి ఓ 83 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు పరిచయమయ్యాడు. అతనికి డీమ్యాట్ ఖాతా తెరవడంలో సహాయపడ్డాడు. ట్రేడింగ్ అంశాలపై సహాయం చేశాడు. దీంతో ఆ వృద్ధుడు నాగరాజును నమ్మి.. ఇంటికి పిలిచాడు. అప్పుడు టేబుల్పై బ్యాంక్ డెబిట్ కార్డుకు సంబంధించి బుక్లెట్ను చూశాడు. అంతే.. ఒక్కసారిగా అతడి బుద్ధి మారిపోయింది.. దాని తీసి జేబులో పెట్టుకున్నాడు. రెండేండ్లు ఆగాడు.. ఆ తర్వాత తన స్నేహితుడిని తీసుకువెళ్లి ఇటీవల రూ.2 లక్షలు విలువ చేసే బంగారం ఆభరణాలను కొన్నాడు. వృద్ధుడు ఫిర్యాదుతో నాగరాజు, అతడికి సహకరించిన కిషన్ పోలీసులకు దొరికిపోయారు. ఇలా నాగరాజు తన ఉద్యోగాన్ని పోగొట్టుకుని జైలు పాలయ్యాడు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ కొన్నేండ్ల పాటు ఇసుక వ్యాపారం చేశాడు. అప్పుడు పేరొందిన వ్యాపారిగా గుర్తింపు పొందాడు. అయితే.. మద్యానికి బానిసై.. అది కూడా విలాసవంతంగా తాగాలనే కోరికతో చాలా చోట్ల అప్పులు చేశాడు. ఇలా తాగుడికి అలవాటు పడి వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఆ వ్యాపారం నష్టాల్లోకి రాగానే అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి మోసాలు చేయాలనుకున్నాడు.. ఇందులో భాగంగానే ఆన్లైన్లో బీఎస్ -4 వాహనాలను తక్కువ ధరకు విక్రయిస్తానని నమ్మించి మోసాలకు పాల్పడి కటకటాలపాలయ్యాడు. అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో నివసించే పెట్రిమ్ గిరిధర్ ముంబై, హైదరాబాద్లో ట్రాన్స్పోర్టు లాజిస్టిక్ మేనేజర్గా పని చేశాడు. ఆ తర్వాత ఆయిల్ ట్రేడింగ్ చేశాడు. దాంట్లో వచ్చే ఆదాయం సరిపోలేదు. దీంతో మైండ్కు పదును పెట్టి .. అక్రమ వ్యాపారానికి స్కెచ్ వేశాడు. దీని కోసం బయో డీజిల్ నిల్వ ఉంచే గోదాంను ఏర్పాటు చేశాడు. ఒక నిప్పురవ్వ పడితే పెద్ద అగ్ని ప్రమాదం సంభవించే పరిస్థితులు ఉన్నా.. వాటిని బేఖాతరు చేసి అక్రమంగా బయో డీజిల్ను నిల్వ ఉంచాడు. తనకు ఆదాయం వస్తుందనే ఆశతో అక్రమ దందాకు శ్రీకారం చుట్టి పోలీసులకు దొరికిపోయాడు.