ఖైరతాబాద్, మే 29 : కరోనాతో అమాయకులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే.. కొందరు వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. సీరియస్ కండీషన్లో నిమ్స్ దవాఖానకు వచ్చిన ఓ రోగి బంధువు వద్ద లక్ష రూపాయలు వసూలు చేశాడు. ఆలస్యంగా గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన కృష్ణా రెడ్డి ఈ నెల 18న తన తల్లి సుగునమ్మకు కరోనా పాజిటివ్ రాగా నిమ్స్లో చేర్పించేందుకు వచ్చాడు. అదే సమయంలో ప్రశాంత్ అనే వ్యక్తి వీరిని కలిసి వివరాలు తెలుసుకున్నాడు. ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేవని, తాను నిమ్స్లోనే పనిచేస్తానని, వైద్యులు, సిబ్బందితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అయితే లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పాడు.
అప్పటికే తల్లి పరిస్థితి విషమిస్తుండటంతో చేసేదేమి లేక అతనికి గూగుల్ పే ద్వారా లక్ష రూపాయలు ముట్టచెప్పాడు. అతను చెప్పినట్టుగానే ఆస్పత్రిలో సుగునమ్మను చేర్పించాడు. వైద్యులు చికిత్స అందిస్తుండగా, మరోసారి ప్రశాంత్.. కృష్ణా రెడ్డిని కలిసి చికిత్స ముందుకు సాగాలంటే మరో లక్ష రూపాయలు ఇవ్వాలని, నిమ్స్లో కొవిడ్ రోగులకు సాధారణ, ఆక్సిజన్ చికిత్సకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలవుతుందని, వెంటిలేటర్లు కావాలంటే రూ.7 లక్షలు తీసుకుంటారని చెప్పాడు. దీంతో అతని వ్యవహారంపై అనుమానం వచ్చి అడ్మిషన్ రిజిష్టర్ను పరిశీలించగా, అందులో వెయ్యి రూపాయలు మాత్రమే రాసి ఉండటంతో ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఈ అంశంపై విచారణ చేపట్టాలని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిమ్స్కు వచ్చిన సుగుణమ్మకు ఆస్పత్రిలో బెడ్ కోసం లక్ష రూపాయలు వసూలు చేసిన ప్రశాంత్ ..ఆమెకు అడ్మిషన్ ఇప్పించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి కుమారుడు డబ్బులు చెల్లించగానే బెడ్ కేటాయింపు జరగడం వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.