ఆక్సిజన్ కాన్సట్రేటర్ మిషన్ కోసం ఆన్లైన్లో ప్రయత్నించిన ఇద్దరు వ్యాపారులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. సిద్ధి అంబర్బజార్కు చెందిన ఆనంద్ శర్మ విద్యుత్తో పనిచేసే ఆక్సిజన్ కాన్సట్రేటర్ మిషన్ను కొనాలనుకున్నాడు. ఈ యంత్రం గాలిలో ఉన్న ఆక్సిజన్ను సమీకరించి, అవసరమైన రోగికి అందిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది పనిచేస్తుందని ఆనంద్ శర్మ భావించాడు. అందుకు గూగుల్లో సెర్చ్ చేయడంతో నరీనా ఆక్సిజన్ కాన్సట్రేటర్ పేరుతో ఉన్న ఒక సంస్థ వివరాలు లభించడంతో వారిని సంప్రదించాడు. మా వద్ద ఆ యంత్రాలున్నాయని రూ.2.73 లక్షలు చెల్లిస్తే, దానిని మీకు డెలివరీ చేస్తామంటూ చెప్పడంతో ఆన్లైన్లో ఆ డబ్బులు బదిలీ చేశాడు. అయితే, ఎంతకు మిషన్ రాకపోవడం, సదరు సంస్థకు ఫోన్ చేస్తే ఫోన్లు స్విచాఫ్గా ఉండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు శనివారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సికింద్రాబాద్ వాసికి.. సికింద్రాబాద్కు చెందిన మరో వ్యక్తి కూడా ఇలాంటి యంత్రాలు రెండు కొనాలనుకున్నాడు. తెలిసిన వారు ఇండియా మార్ట్ నుంచి కొనాలంటూ సూచించడంతో అందులో ఉన్న ఒక సంస్థకు ఫోన్ చేశాడు. తనకు రెండు యంత్రాలు కావాలంటూ కోరడంతో ఒకో దానికి రూ.52,700 చొప్పున, రూ.1,05,400 చెల్లించాలని సదరు వ్యాపారులు సూచించారు. ఆ డబ్బు చెల్లించిన తరువాత యంత్రాలు రాకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.