రాజేంద్రనగర్ జోన్ బృందం: అసెంబ్లీ ఎన్నికలు గత నెల 30న పూర్తయ్యాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గ కౌంటింగ్ను గండిపేట మండలంలోని హిమాయత్సాగర్ లార్డ్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంతో పాటు స్వాతంత్ర అభ్యర్థులు మొత్తం 25 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ మొదటి రౌండ్లో బీఆర్ఎస్ 89 ఓట్ల ఆధిక్యం సాధించింది. మొదట పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యలో జరుగుతుందని ఆశించినప్పటికీ చివరి రౌండ్ వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.
మొదటి రౌండ్లో స్వల్ప మెజార్టీతో మొదలైన బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ మెజార్టీ 2,3,4,5,6వ రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ గట్టి పోటీ ఇచ్చారు. 7వ రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు బీఆర్ఎస్కు నియోజకవర్గ ప్రజలు ఆధిక్యం చూపారు. దాంతో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ 1,21,283 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్రెడి(88,979 ఓట్లు)పై 32,304 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 81,055 ఓట్లు సాధించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజలు ఏకపక్షంగా మద్దతు పలకడం ఆనవాయితీగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నప్పటికీ రాజేంద్రనగర్లో ప్రకాశ్గౌడ్ మరోసారి అఖండమైన మెజార్టీతో విజయం సాధించి తన మార్కును చాటారు. 2009, 2014లో టీడీపీ అభ్యర్థిగా, 2018లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలు పొందగా. 2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచి 4వ సారి విజయకేతనం ఎగరవేసి రాజేంద్రనగర్ గడ్డ ప్రకాశ్గౌడ్ అడ్డాగా మార్చారు.
మణికొండ, డిసెంబర్ 3 : రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రజలు నాలుగోసారి తోలుకంటి ప్రకాశ్గౌడ్కే పట్టం కట్టారు. మూడున్నర దశాబ్దాలుగా క్రీయాశీల రాజకీయాల్లో పనిచేస్తున్న ఆయనకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నది. పిలిస్తే పలికే నేతగా, మాస్ లీడర్గా ఆయన పేరు సంపాధించుకున్నారు. రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రకాశ్గౌడ్ మూడోసారి గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ 15 ఏండ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయన పనితీరుకు మెచ్చి బీఆర్ఎస్ అధిష్టానం మరోసారి 2023 ఎన్నికల్లోనూ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో అధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ ప్రత్యేక ఇంటర్యూ..
నమస్తే తెలంగాణ: రాజేంద్రనగర్లో 4వ సారి విజయం సాధించడంపై మీ అభిప్రాయం?
ఎమ్మెల్యే: మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నా. ప్రజాసమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషిచేస్తా. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణాలు. ప్రజల రుణం తీర్చుకునేందుకు మరింత బాధ్యతగా శ్రమిస్తా.
నమస్తే: నియోజకవర్గంలో క్షణమే చేపట్టాల్సిన ప్రధాన పనులు?
ఎమ్మెల్యే: నియోజకవర్గంలో ప్రధానంగా చేపట్టాల్సినవి.. ఇంటింటికి తాగునీరు, గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థను పునరుద్ధరించడం, నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం.
నమస్తే: పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఏవిధమైన ప్రణాళికలు రూపొందించారు?
ఎమ్మెల్యే: నియోజకవర్గం అంతా సేమీ, అర్బన్ ప్రాంతం. నగరానికి చేరువలో ఉండటంతో వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నారు. దీంతో సమస్యలు పెరుగుతున్నాయి. తదనుగుణంగా తాగునీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల నిర్మాణం చేపడుతున్నాం.
నమస్తే : భూములు కోల్పోయిన బాధితులకు ఈసారైనా న్యాయం జరుగుతుందా?
ఎమ్మెల్యే: కచ్చితంగా భూ భాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. వట్టినాగులపల్లి, హనుమాన్నగర్, భూపాల్నగర్, జలాల్బాబానగర్ వాసులకు న్యాయం జరిగేలా చూస్తా.
నమస్తే: చెరువుల ప్రక్షాళనపై చర్యలేమిటి?
ఎమ్మెల్యే: మిషన్ కాకతీయ పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 41చెరువుల పునరుద్ధరణకు నిధులను వెచ్చించడం జరిగింది. ఆనకట్టలతో పాటు చెరువులను అభివృద్ధి పర్చాము. చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే ఆలోచన ఉన్నది.
పేరు : తోలుకంటి ప్రకాశ్గౌడ్
తల్లిదండ్రులు : తోలుకంటి గండయ్య గౌడ్, లక్ష్మమ్మ
పుట్టిన తేదీ : 05-05-1959
విద్యాభ్యాసం : మూడో తరగతి,
భార్య : టి.సులోచన
సంతానం : ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమారైలు
రాజకీయ ప్రవేశం : 1983లో(టీడీపీ)