అరుదైన కంటి క్యాన్సర్తో అవస్థలు
చికిత్సకు రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 6 : నాలుగేళ్ల చిన్నారి అరుదైన కంటి క్యాన్సర్తో బాధపడుతోంది. ఇప్పటివరకు ఉన్నదంతా అమ్మి, అప్పులు చేసి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. ఇంకా చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెబుతుండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లికి చెందిన అశోక్, సుమలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయి శివాన్షి (4)కి కంటి సమస్య తలెత్తడంతో ఎల్వీప్రసాద్ కంటి దవాఖానకు తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి యశోద ఆస్పత్రి వైద్యులకు చూపించగా.. చిన్నారికి రెటోనా బ్లాస్టోమా (క్యాన్సర్) తీవ్రస్థాయిలో ఉందని, అది కంటి నుంచి మెదడుకు పాకిందని గుర్తించారు. ఇప్పటికే మూడు సెట్టింగ్ల్లో కిమోథెరపీ పూర్తయ్యిందని, మరో ఆరు సెట్టింగ్లు చేస్తే పురోగతి కనిపించి శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపినట్లు చిన్నారి తండ్రి తెలిపారు. దీనికి రూ.10 లక్షలపైనే ఖర్చు అవుతుందని, హమాలీ పనిచేసుకునే తాను అంత ఖర్చు భరించలేనని, దాతలు ముందుకొచ్చి తన చిన్నారిని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. సాయం చేయదల్చిన వారు 9866587713 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నాడు.
రూ.2 లక్షలు అందజేసిన తోబుట్టువులు
తోట పావని, తోట వరలక్ష్మి, తోట మాధవి తోబుట్టువులు. తమ తల్లి చంద్రకళకు చికిత్స జరుగుతుండడంతో బుధవారం చూసేందుకు యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ శివాన్షి తల్లిదండ్రుల దీనగాథను చూసి చలించిపోయి కుటుంబసభ్యుల సహకారంతో 2 లక్షల చెక్కు అందజేశారు.