ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 8: గ్రంథాలయాలకు పూర్వ వైభవం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తార్నాక డివిజన్ కింతీ కాలనీలోని బతుకమ్మకుంట శాఖ గ్రంథాలయం భవన నిర్మాణ పనులకు హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో మొత్తం 82 గ్రంథాలయాలు ఉన్నాయని, అన్నింటినీ అభివృద్ధి పరుస్తున్నామని చెప్పారు. భవనాలు లేని శాఖలకు నూతన భవనాలు నిర్మిస్తున్నామన్నారు. బతుకమ్మకుంట గ్రంథాలయ భవనాన్ని రూ.84 లక్షలతో నిర్మిస్తున్నామని, సంవత్సరంలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, తెలంగాణ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్పర్సన్ ప్రసన్నరామ్మూర్తి, తార్నాక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.