బాలానగర్, జూలై 28 : పాదచారులు రోడ్డును సులువుగా దాటేందుకు వీలుగా ఫిరోజ్గూడలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణమవుతున్నది. ఈ క్రమంలోనే ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టారు. ఫిరోజ్గూడలో చేపట్టిన పాదచారుల వంతెన ఆగస్టు నెలలో అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. పలు కారణాల నేపథ్యంలో పనుల్లో కొంత జాప్యం జరిగింది. ఫతేనగర్, బాలానగర్ డివిజన్ల పరిధిలోని ఫిరోజ్గూడ (ఎయిర్ ఇండియా) వద్ద రెండు డివిజన్లను అనుసంధానం చేస్తూ ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు చేట్టారు.
ఫతేనగర్ డివిజన్ పరిధి గౌతంనగర్ నుంచి బాలానగర్ డివిజన్ ఫిరోజ్గూడకు రోడ్డు దాటాలంటే మధ్యలో పటాన్చెరు నుంచి సికింద్రాబాద్ ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారి నుంచి జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్, పటాన్చెరు నుంచి మేడ్చల్తో పాటు బాలానగర్ నుంచి బోయిన్పల్లికి వెళ్లే ప్రధాన రహదారి ఉండటంతో ఇక్కడ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ ప్రాంతంలో రోడ్డు దాటడం ఇబ్బందికరంగా మారింది. గతంలో విద్యార్థులను గౌతంనగర్ నుంచి ఫిరోజ్గూడకు, ఫిరోజ్గూడ నుంచి గౌతంనగర్కు తరలించడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలు తెరవని కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు లేకున్నా సాధారణ ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ప్రజల ఇబ్బందులను గుర్తించిన బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఫిరోజ్గూడ, గౌతంనగర్లను అనుసంధానం చేస్తూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి జీహెచ్ఎంసీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. రూ. 2.5 కోట్లతో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకున్నాయి. నిర్మాణం పూర్తయితే స్థానికుల ఇబ్బందులు తప్పనున్నాయి.
గౌతంనగర్, ఫిరోజ్గూడలో నిర్మించతలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మొదట్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ స్థలం వద్ద 33 కేవీ విద్యుత్ కేబుల్స్ తొలగించాల్సి ఉండటంతో జాప్యం జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆక్సిజన్ గ్యాస్ కొరత ఏర్పడటంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. మెట్లు, వాక్వే పనులు పూర్తి కావస్తున్నాయి. లిఫ్ట్ ఏర్పాటు, రెయిలింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తాం. వర్షాలు పడితే మరింత ఆలస్యం కావచ్చు. లేదంటే ఆగస్టులో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.- గోవర్ధన్గౌడ్, కూకట్పల్లి సర్కిల్ డీఈ