అమీర్పేట్, జనవరి 28 : వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయని తక్షణమే నీటి సమస్యలను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జలమండలి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం సనత్నగర్, అమీర్పేట్ డివిజన్లో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు అధికారులతో కలిసి పర్యటించారు. ముందుగా అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారితో కలిసి ఎస్ఆర్నగర్ లేన్ 18లో పర్యటించిన మంత్రికి స్థానిక మహిళలు తాము తాగునీటి సమస్యను ఎదర్కొంటున్నామని వివరించారు. స్పందించిన మంత్రి ఈ పరిసర ప్రాంతాల్లో నూతన పైపులైను నిర్మాణం పూర్తయ్యిందని, త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ వీధుల్లో జరుగుతున్న వాహనాల అక్రమ పార్కింగ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు మంత్రికి వివరించగా అక్కడే ఉన్న ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులును తక్షణమే ఇందుకు బాధులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా వీధిదీపాల కింద పెరిగిన చెట్లతో నెలకొన్న అంధకారం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అనంతరం సనత్నగర్ డివిజన్లోని ఎల్ఐజీ క్వార్టర్స్లో సమస్యాత్మకంగా మారిన ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, వేళాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, పార్కును అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎల్ఐజీ నివాసితుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేయగా త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. సనత్నగర్ ప్రధాన రహదారిపై ఉన్న లోధా అపార్ట్మెంట్ నుంచి పారిశ్రామికవాడ మార్గంలోని సివిటస్ అపార్ట్మెంట్స్ వరకు రూ. 31 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, జెక్కాలనీలోని స్ట్రీట్ నెంబర్ 1లో రూ. 30 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ కొలను లక్ష్మిబాల్రెడ్డితో కలిసి మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు.
ఆర్చి నిర్మాణంలో రాజీవద్దు…
జెక్కాలనీ మార్గంలో నిర్మిస్తున్న సనత్నగర్ హనుమాన్ దేవాలయ ఆర్చి నిర్మాణ విషయమై కాలనీ నివాసితులు మంత్రి తలసానికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ నిర్మితమవుతున్న ఆర్చి నిర్ధేశించిన స్థలం కంటే తక్కువ స్థలంలో నిర్మితమవుతుందని, దీని ఫలితంగా పాదచారులు, వాహనదారులకు పలు సమస్యలు ఎదురవుతాయని వివరించారు. స్పందించిన మంత్రి దేవాలయ ఆర్చి నిర్మాణ అంశాల్లో ఎటువంటి రాజీ ధోరణి ఉండరాదని అక్కడే ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ముందుగా నిర్ధేశించిన ప్రకారం కాకుండా మార్పులు ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు.