సిటీబ్యూరో, మే 5 (నమస్తేతెలంగాణ): ఔటర్రింగ్ రోడ్డు నుంచి ఐటీ కారిడార్కు సులభతర ప్రయాణం కోసం చేపడుతున్న శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.313.52 కోట్లతో 1.75 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న వంతెన పనులకు 2020 మార్చి 1న శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలి జంక్షన్ మీదుగా రెండు వైపులా శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ను 4లేన్లతో, కొండాపూర్ వైపు 6 లేన్లతో ఓఆర్ఆర్కు అనుసంధానం చేస్తూ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అత్యంత పొడవైన స్పాన్ను గచ్చిబౌలి వంతెన మీదుగా 64 మీటర్ల మేర విజయ వంతంగా బిగించారు. కీలకమైన స్పాన్ బిగింపు ప్రక్రియ ముగియడం, ప్రస్తుతం ఫ్యాబ్రికేషన్ స్టీల్ ఫియర్స్, స్లాబ్, స్టీల్ గిడ్డర్స్, క్రాష్ బారియర్స్, ఆర్సీసీ రిటర్నింగ్ వాల్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఫేజ్-1లోని వై ఆకారంలో ఈ నిర్మాణం జరుగుతుండగా.. గచ్చిబౌలి పైవంతెన మీదుగా వెళ్లి ఓఆర్ఆర్కు ఇరువైపులా తాకుతుంది. ఈ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆగస్టు 13 నాటికల్లా పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. ఇది పూర్తయితే గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గడంతోపాటు హైటెక్సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రయాణం సులువుకానుంది.
వచ్చేనెలలో కైత్లాపూర్ ఆర్వోబీ
కూకట్పల్లి నియోజకవర్గంలో కైత్లాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ.83 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)పనులు తుదిదశకు చేరాయి. కైత్లాపూర్ వద్ద న్యాయపరమైన చిక్కులు ఇటీవల తొలగిపోవడంతో మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. జూన్ మాసంలో ఆర్వోబీని అందుబాటులోకి తీసుకొస్తామని ఇంజనీరింగ్ విభాగం ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. కూకట్పల్లి నుంచి హైటెక్సిటీకి వెళ్లే వారికి ఈ ఆర్వోబీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.