సిటీబ్యూరో, అక్టోబరు 7(నమస్తే తెలంగాణ): మహా నగరంలో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయే అతి పెద్ద కూడలి ఉప్పల్. ఇక మీదట ఉప్పల్ జంక్షన్లోనూ వాహనాలు ఆపకుండా ప్రయాణం చేయొచ్చు. ట్రాఫిక్ చిక్కులతో కనిపించిన ఈ జంక్షన్ ట్రాఫిక్ రహిత కూడలిగా మారబోతున్నది. ఈ మేరకు 100 శాతం శాశ్వత పరిష్కారంగా జీహెచ్ఎంసీ రూ.311 కోట్లతో రెండు పై వంతెనల నిర్మాణానికి మార్గం సుగమమం చేసింది. ప్రస్తుతం ఉప్పల్ జంక్షన్ నుంచి 6.5 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల వెడల్పుతో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తోంది. ఈ కారిడార్ జంక్షన్కి 300 మీటర్ల దూరంలో ఆగుతున్నది.
ఇక్కడే జీహెచ్ఎంసీ ఈ జంక్షన్ను దాటించి రామంతాపూర్ వైపు పొడగించే పనులు, సికింద్రాబాద్ నుంచి నాగోల్ వైపు మెట్రోకు సరి సమానంగా ఓ వంతెన చేపట్టాలని నిర్ణయించింది. ఇంకా ప్రభుత్వానికి రూ.311 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించగా, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు చేపట్టి రాబోయే రెండేళ్లలోగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
రద్దీగా ఉండే జంక్షన్లు ట్రాఫిక్ రహితంగా మారుతున్నాయి. హైదరాబాద్ మహా నగర ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మక దారులతో నగరవాసులు ఊరట పొందుతున్నారు. ఇందులో భాగంగానే ఉప్పల్లో ఎన్హెచ్ఏఐ నిర్మిస్తోన్న భారీ వంతెన డిజైన్లను జీహెచ్ఎంసీ సవరణలు సూచించింది. ఈ మేరకు రెండు వంతెనలు నిర్మాణాలను పరిశీలిస్తే, జంక్షన్కు 300 మీటర్ల ముందే ఆగిపోయే ఎన్హెచ్ఏఐ నిర్మాణాన్ని స్టేడియం రోడ్డు వైపు పొడగించనున్నారు. ప్రస్తుతం, మెట్రోకు దాదాపు 20 మీటర్ల ఎత్తున ఈ వంతెన నిర్మాణం జరుగనుంది.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పాదచారుల సౌకర్యార్థం జంక్షన్లో జరుగుతున్న ఆకాశమార్గం నిర్మాణం జరుగుతున్నది. వృత్తాకారంలో అన్ని వైపులా ఉన్న రోడ్లను కలుపుతూ ఈ స్కైవే పనులు జరుగుతున్నాయి. ఇది మెట్రో రైలు మార్గం కింద నిర్మాణం జరుగుతుంది. మరో వంతెన నిర్మాణంలో భాగంగానే మెట్రో ఎత్తులోనే సికింద్రాబాద్-నాగోల్ మధ్య రాకపోకలను సులభతరం చేసేలా ఈ నిర్మాణం జరుగనుంది. ఇరువైపులా ఈ రెండు పై వంతెనలు కూడలిలో సిగ్నల్ ఫ్రీ చేయనున్నాయి. కాగా, వరంగల్ వైపు నుంచి నారాపల్లి-ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నగరంలోకి ప్రవేశించే వారంతా క్రికెట్ స్టేడియం నుంచి సికింద్రాబాద్ వైపు సులభతరంగా చేరొచ్చు. సికింద్రాబాద్ వైపు నుంచి నాగోల్ వెళ్లేందుకు కూడా కూడలిలో ఆగకుండా వెళ్లే వీలుంటుంది.
అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ దాదాపు రూ.20 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆకాశమార్గాన్ని (స్కైవాక్) ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం, ప్రాజెక్టులో 30 శాతం మేర పనులు జరగగా, కరోనా కారణంగా పనుల్లో కాస్త జాప్యం జరిగిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా ఈ స్కై వాక్ అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. రామంతాపూర్ – బోడుప్పల్ రోడ్కు, హబ్సీగూడ – ఎల్బీనగర్ వైపు మార్గాలను అనుసంధానం చేస్తూ పాదచారులు అన్ని వైపులా వెళ్లేందుకు వీలుగా, ఈ జంక్షన్ చుట్టూ సర్కిల్ ఆకారంలో స్కై వాక్ పనులను హెచ్ఎండీఏ చేపడుతున్నది. ఉప్పల్ జంక్షన్, కాలేజీ, స్కూళ్లతో పాటు వరంగల్ జాతీయ రహదారి కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఉప్పల్ స్టేషన్లో మెట్రో రాకతో ఈ జంక్షన్ మరింత రద్దీగా మారింది. ఒక చోట నుంచి మరో వైపునకు వెళ్లాలంటే ప్రయాణికులకు ముచ్చెమటలే! ఇదే సమయంలో యధేచ్ఛగా దూసుకువచ్చే లారీలతో ప్రమాదాలు తరచు జరగడం, పాదచారుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ స్కైవాక్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం గమనార్హం.
ఉప్పల్ జంక్షన్లో గ్రేడ్ సఫరేటర్/భారీ వంతెన, అండర్ పాస్ నిర్మాణ వ్యయం రూ.311 కోట్లు
ఎలివేటెడ్ కారిడార్ పొడవు -1080 మీటర్లు, ఆరు లేన్లతో 24.4 మీటర్లు
కర్డ్ ఫ్లై ఓవర్ (స్టేడియం రోడ్) -440 మీటర్లు, మూడు లేన్లతో 11.4 మీటర్లు
మెట్రో ఫిల్లర్ల వెంబడి ఇరువైపులా 445 మీటర్లు, మూడు లేన్లతో 12 మీటర్ల మేర
2015 సంవత్సరంలో ఉప్పల్ కూడలిలో గంటకు ఫ్యాసింజర్ కార్ యూనిట్ 11334 ఉండగా, 2035 సంవత్సరం నాటికి 18148 మేర వాహన రద్దీ ఉంటుందని అంచనా. ఈ గ్రేడ్ సఫరేటర్తో ఉప్పల్ జంక్షన్లో 100 శాతం ట్రాఫిక్కు శాశ్వత విముక్తి లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.