మేడ్చల్ కలెక్టరేట్,సెప్టెంబర్7: స్వరాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వ నిధులు, పన్నులతో పాటు వివిధ రకాలుగా సమకూరుతున్న నిధులతో నగర హంగులను సొంతం చేసుకుంటున్నాయి. నాగారం మున్సిపాలిటీకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) వరంగా మారింది. భారీగా సమకూరిన నిధులు అభివృద్ధికి ఊతమిచ్చాయి. పలు వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి పాలకవర్గం ఆ నిధులను వినియోగించుకుంది.బీటీ రోడ్లు, ప్రహరీల నిర్మాణం, పార్కులు, వైకుంఠ ధామాల అభివృద్ధి చేశారు.
రూ.13.38 కోట్లతో అభివృద్ధి
ఎల్ఆర్ఎస్ కింద నాగారం మున్సిపాలిటీకి రూ. 13.38 కోట్లు సమకూరాయి.ఆ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.రూ.7.12 కోట్లతో మున్సిపాలిటీ పరిధిలోని 53 కాలనీల్లో బీటీ రోడ్లను నిర్మించారు. రూ.1.99 కోట్లతో అవసరం ఉన్న 16 చోట్ల ప్రహరీలను నిర్మించారు. రూ.2.30 కోట్ల వైకుంఠధామాలను అభివృద్ధి చేశారు. రూ.90. లక్షలతో 23 విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు 23 విద్యు త్ పనులు నిర్వహించారు. రూ.20 లక్షలతో వివిధ వార్డుల్లో నాలుగు చోట్ల పిల్లల ఆడుకోవడానికి ఆట వస్తువులు, పరికరాలను ఏర్పాటు చేశారు. రూ. 62. లక్షలతో రెండు పార్కులను అభివృద్ధి చేశారు. మరో రూ. 22లక్షలతో 5 చోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తి చేశారు.
రోడ్ల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి..
గుంతల రోడ్లతో అనేక ఇబ్బందులు పడ్డాం. అనేక కాలనీల్లో గుంతల రోడ్లను బీటీ, సిమెంట్ రోడ్లుగా మార్చడంతో ప్రయాణం సాఫీగా సాగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీఅభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభివృద్ధి పనులు చేస్తున్న చైర్మన్ చంద్రారెడ్డి, కౌన్సిలర్ వెంకట్రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు.
-ఎన్.కృష్ణారెడ్డి, అధ్యక్షులు, ఈస్ట్గాంధీ నగర్, నాగారం
కాలనీల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు..
మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు,సమస్యలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టిసారించారు. వైకుంధామాలు, పార్కులు, రోడ్లు, ప్రహరీ నిర్మాణపనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.నాగారం మున్సిపాలిటీగా మారిన తరువాత అభివృద్ధిలో ముందుంది.
-బాల్రెడ్డి, 20వ వార్డు, నాగారం మున్సిపాలిటీ
అభివృద్ధికి ఎల్ఆర్ఎస్ నిధులు వినియోగం
మున్సిపాలిటీ పరిధిలో ని పలు వార్డుల్లో అభివృద్ధి పనుల నిర్వహణ ఎల్ఆర్ఎస్ నిధులను వినియోగించుకున్నాం. మున్సిపాలిటీ నిధులకు ఎల్ఆర్ఎస్ నిధు లు తోడవడంతో అభివృద్ధికి ఎంతగానో ఉపయోపగడ్డాయి. ఆ నిధులతో 20 వార్డుల్లో అసౌకర్యంగా ఉన్న అంతర్గత రోడ్లను బీటీగా రోడ్లగా మార్చాం. మున్సిపాలిటీ అభివృద్ధి సహకరిస్తున్న ప్రభుత్వానికి, మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతోకాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న కాలనీలను మున్సిపాలిటీగా మారి న తర్వాత సమకూరిన నిధులతో అభివృద్ధి చేసుకున్నాం. ఎన్నో సమస్యల పరిష్కారం అయ్యాయి.
-చంద్రారెడ్డి, చైర్మన్, నాగారం మున్సిపాలిటీ
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చాం. అందుబాటులో ఉన్న ఎల్ఆర్ఎస్ నిధులకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి, పనులు చేపట్టాం. 53 కాలనీల్లో రోడ్ల సమస్యలను పరిష్కరించాం. బీటీ రోడ్ల నిర్మాణంతో ఆయా కాలనీ అందంగా మారాయి. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రధానంగా వర్షకాలంలో రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడేవారు.ఆ సమస్యను పూర్తిగా రూపుమాపాం. రోడ్లతో పాటు మిగితా నిధులను విద్యుత్ పనులను నిర్వహణ, పార్కుల అభివృద్ధికి వినియోగించాం.
-రాజేందర్కుమార్,కమిషనర్,నాగారం మున్సిపాలిటీ