వెంగళరావునగర్, జనవరి 23 : అమూల్ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖ మంటలు అదుపుచేయడం ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వెంగళరావునగర్ కాలనీలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న అమూల్ ఐస్ క్రీమ్కు చెందిన గోడౌన్ లోనుంచి సోమవారం ఉదయం 7.30 ప్రాంతంలో మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు, ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ వైర్లు సరిగా లేకపోవడం వల్లే షార్ట్సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని ఎస్ఐ జమాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో, మంటలను అదుపుచేసే సమయంలోనూ గోడౌన్కు సంబంధించిన సిబ్బంది లేరన్నారు. వెంటనే స్పందించిన సనత్నగర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపుచేసినట్టు చెప్పారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందన్నారు.
అమూల్ గోడౌన్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని సనత్నగర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు వీలుగా గోడౌన్లో ఎలాంటి పరికరాలు అందుబాటులో లేవన్నారు. నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
జనావాసాల మధ్య ఉన్న గోడౌన్ను ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రాణ, ఆస్తినష్టం జరగలేదన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ఈ గోడౌన్ను వెంటనే కాలనీ నుంచి తరలించాలని స్థానికులు కోరారు.