సుల్తాన్బజార్,మే 27: కోఠి ట్రూప్బజార్లోని ఫిర్దౌస్ మాల్లోని రెండో అంతస్తులోని ఎల్ఈడీ లైట్ హౌస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దుకాణంలోని సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని పోలీసులు పేర్కొన్నారు.పోలీసులు,అగ్నిమాపక అధికారుల కథనం ప్రకారం…. ట్రూప్బజార్లోని జీ ప్లస్ 3 ఫిర్దౌస్ మాల్ భవనంలో ఎల్ఈడీ లైట్ హౌస్ రెండో అంతస్తులో కొనసాగుతుంది.
కాగా శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా రెండో అంతస్తులో మంటలు చెలరేగడంతో షాఫులో పని చేస్తున్న సిబ్బంది బయటికి పరుగులు తీశారు. వెంటనే సుల్తాన్బజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖకు విషయాన్ని తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనా స్థలికి చేరుకున్న అగ్ని మాపక అధికారులు, సిబ్బంది సుమారు గంటన్నర పాటు మూడు భారీ ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా భవనం మూడో అంతస్తులోని పెంట్హౌజ్లో ఉంటున్న టి. పద్మ(46), దుర్గా ప్రసాద్(26) అగ్ని ప్రమాదంతో ఏర్పడిన దట్టమైన పొగల్లో ఇరుక్కున్నారు. వారిని పోలీసులు, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది మెట్ల ద్వారా క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. సమయానికి ఘటనా స్థలికి చేరుకొని ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది చేసిన కృషిని ప్రతి ఒక్కరూ అభినందించారు. సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్, ఎస్ఐలు సుజాత, శ్రీకాంత్రెడ్డి, కిరణ్కుమార్, అగ్నిమాపక శాఖ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి, అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ టి.శ్రీనివాస్, గౌలిగూడ ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్తో పాటు ఫైర్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.