సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ): జియాగూడ బైపాస్ రోడ్డులో సీవరేజి నెట్వర్క్ పైపులైన్ నిర్మాణ పనులు జరుపుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన ముగ్గురు కార్మికులు శ్రీనివాస్, హనుమంతు, వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఆర్థికంగా సాయం అందించి ఆదుకుంది. జాతీయ సఫాయి కర్మాచారి చైర్ పర్సన్ ఎం.వెంకటేశన్ మంగళవారం హైదరాబాద్కు విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు. ఈ మేరకు ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో బాధిత ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మూడు కుటుంబాలకు రూ.30 లక్షలు విలువైన చెక్కులను తక్షణ సాయంగా జల మండలి ఎండీ సుదర్శన్రెడ్డితో కలిసి అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దే శంతో ఈ తక్షణ సాయం అందజేశారు. అంతకు ముందు చైర్ పర్సన్ ఎం.వెంకటేశన్, ఎండీ ఉన్నతాధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎం రఘు, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.