సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): రానున్న ఎన్నికల నేపథ్యంలో తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రోల్ అబ్జర్వర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఈఆర్ఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్, అంబర్పేట, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటరు జాబితాను పరిశీలించారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయాలని నిర్దేశించిన ప్రకారంగా, తయారు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అక్టోబరు 4న తుది ఓటరు జాబితా విడుదల తరుణంలో తప్పులు లేకుండా తయారు చేసేందుకు అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాశ్ బీఎల్ఓ సూపర్వైజర్లతో ఇంటరాక్ట్ అయ్యా రు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎంసీ ఈఇఆర్ఓ శైలజ, గోషామహల్ డిప్యూటీ కమిషనర్ బాలయ్య, ఆర్వో వి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.