సిటీబ్యూరో, డిసెంబర్ 11 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలే విజేతను తేల్చే రేసింగ్ ఘట్టానికి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. మెరుపువేగంతో కార్లు ట్రాక్ వెంట దూసుకుపోతుంటే కేరింతలు కొడుతూ సందడి చేశారు. మొత్తంగా హోరా హోరీగా సాగిన గ్రాండ్ ఫినాలే రేసింగ్ పోటీల్లో గాడ్స్పీడ్ కొచ్చి జట్టు విజేతగా నిలువగా, హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం ఉదయం 9:30 నుంచి ప్రారంభమైన పోటీలు సాయంత్రం 5 గంటల వరకు రౌండ్ల వారీగా జరిగాయి. గంటకు 250 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీసిన కార్లు సందడి చేశాయి. శనివారం సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన క్వాలిఫైయింగ్, స్ప్రింట్ రేసింగ్ పోటీలను ఆదివారం మధ్యాహ్నం వరకు నిర్వహించారు. ఈ పోటీలలో మూడు సార్లు కార్లు డివైడర్కు ఢీకొట్టడంతో నిర్వాహకులు త్వరితగతిన వాటిని క్లియర్ చేశారు. ఇదిలా ఉండగా వాతావరణం చల్లబడటంతో పోటీలకు అంత అనుకూలంగా లేకపోయినా నిర్వాహకులు పోటీలు నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను వీక్షించారు. కాగా, ఇండియన్ రేసింగ్ లీగ్లో భాగంగా హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్.. గత నెల 19, 20 తేదీలలో, ఈనెల 10, 11న పోటీలు నిర్వహించి మోటార్ స్పోర్ట్స్ అభిమానులను అలరించింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి అంతర్జాతీయ రేసింగ్ పోటీలు జరుగనున్నాయి.
ట్రాక్పై శునకం..!
కాగా పోటీలు జరుగడానికి ముందు ట్రాక్పై ఓ శునకం పరుగులు తీస్తూ నిర్వాహకులను కలవరపెట్టింది. ట్రాక్పై రేసర్లా దూసుకుపోవడంతో సందర్శకులు చప్పట్లతో శునకాన్ని తమ మొబైల్స్లో బంధించారు.
సందడి చేసిన సినీ హీరోలు..!!
ఇండియన్ రేసింగ్ పోటీల్లో హీరో రాంచరణ్, అయన సతీమణి ఉపాసన, హీరో నాగచైతన్య సందడి చేశారు. హైదరాబాద్ రేసింగ్ ట్రాక్ అద్భుతంగా ఉందని.. రేసింగ్ పోటీలు ఇంత గొప్పగా నిర్వహించడం అత్యంత గొప్ప విషయమని కొనియాడారు. రేసింగ్ పోటీలు అంటే తమకు చాలా ఇష్టమని నాగా చైతన్య చెప్పారు. ప్రత్యేక వాహనంలో ప్రయాణించి ట్రాక్ను పరిశీలించారు.
విజేతలు ఇలా..!