సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): గొలుసు కట్టు విధానంలో ట్రేడింగ్ పేరుతో కోట్లాది రూపాయల మోసం చేసిన ముక్తిరాజ్, అతడి అనుచరులు ఈ నెల 14వ తేదీన ఒక్క రోజే బ్యాంకు ఖాతా నుంచి రూ.7.5 కోట్లు డ్రా చేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. హబ్సిగూడలో మల్టీజెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ప్రారంభించి, ఆ సంస్థ పేరుతోనే ఒక యాప్ను రూపొందించిన నిర్వాహకులు.. ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టడండి, రోజుకు జీఎస్టీ, సర్వీస్ చార్జీలు మినహాయించుకొని 2 శాతం లాభాలు ఇస్తామంటూ నమ్మించారు.
అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారు. వసూలు చేసిన సుమారు రూ.150 కోట్లకు పైగా డబ్బుతో నిర్వాహకులు పరారయ్యారు. ఈ మోసాన్ని గుర్తించిన బాధితులు మంగళవారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ నర్సింగ్రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు ప్రారంభించింది. బుధవారం కూడా పలువురు బాధితులు సీసీఎస్కు వచ్చి తాము కూడా లక్షల్లో మోసపోయామంటూ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. ముక్తిరాజ్ పాత నేరస్తుడు కావడంతో అతడి నేరచరిత్రను సీసీఎస్ పోలీసులు అరా తీస్తున్నారు. బాధితుల్లో జైలు శాఖ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఉన్నారు.